అమరావతి బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ దిగ్గజం Ernst & Young (EY) అమరావతిలో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ రంగంలో వస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్లలో ఇది ఒకటిగా నిలవబోతోంది.
అమరావతిని కేవలం పరిపాలన నగరంలా కాకుండా, ఆర్థికంగా, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు నాయుడు విజన్కు EY రాక గట్టి బలాన్ని ఇచ్చింది. అమరావతిలో EY తన గ్లోబల్ డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ట్యాక్స్ కన్సల్టింగ్, ఆడిటింగ్ సేవలను అందించనున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహా వైబ్ ఇప్పుడు అమరావతిలో కనిపించబోతోంది.
Also Read : అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో వాస్తవాలు ఇవే..!
ఈవై రాకతో కేవలం భవనాలు మాత్రమే రావడం లేదు, ఏపీ యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టనున్నాయి. ప్రారంభ దశలోనే వేల సంఖ్యలో ప్రొఫెషనల్ ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఫైనాన్షియల్ అనలిస్టులు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఇది ఒక సువర్ణావకాశం. మన రాష్ట్ర విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే గ్లోబల్ కంపెనీలో పనిచేసే అదృష్టం దక్కబోతోంది.
ఈవై లాంటి బిగ్ ఫోర్ కంపెనీలు ఒక చోటికి వచ్చాయంటే, వాటి వెంటే ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా క్యూ కడతాయి. ఇప్పటికే అమరావతిలో మౌలిక సదుపాయాలు వేగంగా పుంజుకుంటున్న తరుణంలో, ఈవై ఎంట్రీతో రియల్ ఎస్టేట్ నుంచి సర్వీస్ సెక్టార్ వరకు అన్ని రంగాల్లో కొత్త ఊపు రానుంది. లోకేష్ తన పర్యటనల్లో పదేపదే చెబుతున్నట్లుగా, అమరావతిని సెమీకండక్టర్, ఐటీ హబ్గా మార్చడంలో ఈ పరిణామం కీలకం.
Also Read : గేమ్ ఆడుతున్న పాక్.. అమెరికా చేతిలో షాక్ తప్పదా..?
మొత్తానికి అమరావతి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. ఎకానమీకి బూస్ట్ ఇస్తూ, యువతకు భరోసా కల్పిస్తూ ఈవై అడుగుపెట్టడం అనేది రాజధాని నిర్మాణంలో ఒక మైలురాయి. బ్రాండ్ అమరావతి ఇక గ్లోబల్ మ్యాప్లో టాప్ గేర్లో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

