అమెరికాలో ఉద్యోగం చేస్తోన్న తెలుగుసంతతి.. చిరంజీవి కొల్లా వ్యాలీ ఫీవర్ బారిన పడి మృతి చెందడం ఇప్పుడు ప్రవాస భారతీయులను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాలీ ఫీవర్ అంటే ఏమిటి, అది ఎంత ప్రమాదకరం అనే అంశాలపై విస్త్రుతమైన చర్చ జరుగుతోంది. ఇది ఒక అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ గా నిపుణులు చెప్తున్నారు. మరి అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది..? ఇది భారతీయులకు ఎంతటి ముప్పు..? అనేది ఒకసారి చూద్దాం.
Also Read :
వైద్య పరిభాషలో దీనిని కాక్సిడియోమైకోసిస్ అని పిలుస్తారు. ఇది వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి కాదు, ఇదొక ఫంగస్ వల్ల వస్తుంది. కాక్సిడియోయిడ్స్ అనే శిలీంధ్రం బీజాంశాలు గాలిలో కలిసి ఉన్నప్పుడు, వాటిని పీల్చడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ ఫంగస్ ప్రధానంగా అమెరికాలోని కాలిఫోర్నియా, అరిజోనా వంటి నైరుతి ప్రాంతాల్లోని పొడి నేలల్లో ఉంటుంది. గాలి వీచినప్పుడు లేదా నేలను తవ్వినప్పుడు ఆ మట్టిలోని ఫంగస్ రేణువులు గాలిలోకి వస్తాయి. ఆ గాలిని పీల్చినప్పుడు అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి.
ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు, కేవలం ఆ గాలిని పీల్చడం వల్లే వస్తుంది. చాలా మందిలో ఇది సాధారణ ఫ్లూ లాగే కనిపిస్తుంది. మరి ఇది భారతీయులను ఎందుకు భయపెడుతోంది..? సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే, చిరంజీవి కొల్లా వంటి ఆరోగ్యవంతుడైన యువకుడు ఈ వ్యాధితో మరణించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ఎడారి ప్రాంతాల్లో నివసించే భారతీయులు, విద్యార్థులు ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read :
గాలి ద్వారా సోకే ఈ వ్యాధిని గుర్తించడం కష్టం కావడం, ముదిరితే ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాపాయం సంభవించడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికాలోని నైరుతి ప్రాంతాల్లో ఉండేవారు ధూళి ఎక్కువగా ఉన్నప్పుడు మాస్కులు ధరించడం, పొడి నేలలు లేదా నిర్మాణాలు జరుగుతున్న చోట జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో గుర్తిస్తే చికిత్స సాధ్యమే కానీ, నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది ప్రాణాంతకమని చిరంజీవి ఘటన హెచ్చరిస్తోంది.

