2024 లో ఓటమి తర్వాత బలహీనపడిన వైసీపీ.. పలు నిర్ణయాలతో ఇబ్బంది పడుతూ వస్తోంది. ఇక మైనార్టీ ఓటు బ్యాంకు వైసీపీకి దూరమైంది అనే వార్తలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపధ్యంలో తాజాగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక సమావేశానికి రంగం సిద్దం చేసారు. నేడు వైఎస్ జగన్ విజయవాడలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విందులో ముస్లిం మత పెద్దలు, పార్టీ ముఖ్య నాయకులు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు సహా పలువురు పాల్గొనే అవకాశం ఉంది.
Also Read : హైదరాబాద్ లో బార్లు, రెస్టారెంట్ లలో చికెన్ తింటున్నారా..?
తొలుత ఈ కార్యక్రమాన్ని మార్చి 10న గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించాలని భావించారు. అయితే వేదిక మారడానికి నేతల మధ్య ఆధిపత్య పోరు ప్రధానంగా కనపడుతోంది. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు, ముఖ్యంగా ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రచారానికి సంబంధించి వివాదాలు తలెత్తడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్థానిక నేతల మధ్య బిర్యానీ కాంట్రాక్ట్ కు సంబంధించి జరిగిన ఘర్షణ కూడా ఈ వాయిదాకు ఒక కారణమని ప్రచారం జరుగుతోంది.
Also Read : రక్త హీనత ఉంటే కాఫీ, టీ తాగకూడదా..?
పార్టీ వర్గాలు మాత్రం భద్రతా పరమైన కారణాల దృష్ట్యానే వేదికను విజయవాడకు మార్చినట్లు ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. రాబోయే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముస్లిం మైనారిటీ ఓటర్లను కాపాడుకోవడానికి ఈ విందు అత్యంత కీలకంగా వైఎస్ జగన్ భావిస్తున్నట్లు.. రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గుంటూరులో బయటపడిన విభేదాలను చక్కదిద్దడానికి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల నేతలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి జగన్ ఈ వేదికను ఉపయోగిస్తున్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఇమాం, మౌజంలకు 45 కోట్ల రూపాయల బకాయిలు క్లియర్ చేసిన నేపధ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

