మోయీనాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈగల్ పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ దొరికిన డ్రగ్స్ కంటే, అక్కడ జరిగిన చర్చలే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ పార్టీ వెనుక కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే లేదు.. అంతకు మించిన పెద్దల సెటిల్మెంట్ ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు తమ సంపాదనను దుబాయ్ లో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టారనేది బహిరంగ రహస్యం.
Also Read : ఇజ్రాయిల్ ప్రధాని ఎక్కడ..? అది డీప్ ఫేక్ వీడియో..?
ఈ ఆస్తుల పంపకాలు లేదా వాటాల విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ‘దుబాయ్ లొల్లి’ని సెటిల్ చేయడానికే హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఈ రహస్య భేటీ జరిగిందని చర్చ నడుస్తోంది. ఈ కథలో అత్యంత కీలకమైన పేరు కేదార్. ప్రముఖుల సొమ్మును దుబాయ్ కి తరలించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని టాక్. అయితే, కేదార్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించారు. కేదార్ మరణించిన సమయంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారనే వార్తలు ఇప్పుడు కొత్త అనుమానాలకు తెరలేపాయి.
కేదార్ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఈ ఫామ్హౌస్ పార్టీతో ముడిపడి ఉందా? అనేది ఇప్పుడు సస్పెన్స్. ఈ పార్టీకి కేవలం లోకల్ వాళ్లే కాదు, ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం నమిత్ శర్మ, బెంగళూరుకు చెందిన ప్రముఖ లాయర్ కౌశిక్ రవి కూడా హాజరయ్యారు. ఒక డ్రగ్స్ పార్టీకి ఇంత హై-ప్రొఫైల్ వ్యక్తులు రావడం వెనుక ఏదో పెద్ద వ్యూహమే ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆస్తుల వివాదాల పరిష్కారం కోసమే లాయర్లను, ఇన్వెస్టర్లను పిలిపించారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
Also Read : ముఖం చాటేసిన మంత్రులు..!
దుబాయ్లో పెట్టుబడులు పెట్టిన ఆ ‘పెద్దలు’ ఎవరు? కేదార్ ద్వారా ఎంత మొత్తం చేతులు మారింది? ఈ ఫామ్హౌస్ మీటింగ్లో ఎవరెవరి వాటాల గురించి చర్చ జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే.. టాలీవుడ్ నుంచి పొలిటికల్ కారిడార్స్ వరకు చాలా మంది ముసుగులు తొలగిపోయే అవకాశం ఉంది. డ్రగ్స్ అనేది కేవలం ఒక నెపం మాత్రమే.. దీని వెనుక ఉన్న అసలు వ్యవహారాలు, మనీ లాండరింగ్ మరియు దుబాయ్ ఆస్తుల లెక్కలు తేలాల్సి ఉంది. పోలీసులు ఈ ‘దుబాయ్ కనెక్షన్’ మీద ఫోకస్ పెడితే, మరిన్ని సంచలన నిజాలు బయటకు రావడం ఖాయం అంటున్నాయి రాజకీయ వర్గాలు.

