హెచ్ జే దొర.. ఈ తరానికి పెద్దగా పరిచయం లేని పేరు ఇది. కానీ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు, మాజీ మంత్రులకు ఈ పేరు బాగా సుపరిచితం. ఎన్టీఆర్ పాలనను ఎంతో దగ్గరగా చూసిన ఐపిఎస్ అధికారులలో ఆయన ఒకరు. పీపుల్స్ వార్ గ్రూప్ ను, ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలను ఎదుర్కొనే విషయంలో ఎంతో సమర్ధవంతమైన అధికారిగా పేరు గాంచిన హెచ్ జే దొర నేడు కన్నుమూసారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో అనారోగ్యంతో బాధ పడుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
Also Read : రేవంత్ ధీమా.. మరి చంద్రబాబు..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీగా పని చేసిన హెచ్ జే దొర.. అసలు పేరు హన్మంతు జ్యోతి దొర. 1943లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన దొర పోలీసు విభాగంలో సుమారు నాలుగు దశాబ్దాలపాటు సేవలు అందించారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆయన.. పలువురు ముఖ్యమంత్రులకు నమ్మకమైన అధికారిగా కూడా పని చేసారు. మొదట అడిషనల్ డీజీపీగా అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు దొర.
Also Read : జంతు కొవ్వుపై సుప్రీం కీలక కామెంట్స్
1965 బ్యాచ్ కు చెందిన దొర 1996 లో డీజీపీ గా ప్రమోషన్ తెచ్చుకున్నారు. ఇక ఎన్టీఆర్ కు దొరకు ఎంతో మంచి సాన్నిహిత్యం ఉండేది. పలు ఇంటర్వ్యూలలో కూడా ఎన్టీఆర్ గురించి దొర ఆసక్తికర కామెంట్స్ చేసేవారు. ఎన్టీఆర్ పై అభిమానంతో ఎన్టీఆర్ తో నేను.. అనే పుస్తకాన్ని కూడా రచించారు. పీపుల్స్ వార్ పేరుతో నాడు ఉమ్మడి రాష్ట్రంలో బలంగా విస్తరించిన మావోయిస్టు పార్టీని ఎదుర్కోవడంలో.. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో పోలీస్ స్టేషన్ లను బలోపేతం చేయడంలో దొర కీలక పాత్ర పోషించారు.

