విదేశాల్లో మారుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా, కెనడా సహా పలు యూరప్ దేశాలకు వెళ్లి స్థిరపడాలి అని భావించిన ఎందరో విద్యార్ధులు ఇప్పుడు వెనక్కు తగ్గుతున్నారు. ముఖ్యంగా భారత్ నుంచి అమెరికా వెళ్ళాలి అనుకున్న ఎందరో డ్రాప్ అయిపోయారు. ఈ నేపధ్యంలో తాజాగా కేంద్ర విద్యా శాఖ పలు కీలక విషయాలు బయటపెట్టింది. విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించిన డేటా ప్రకారం, గత మూడు సంవత్సరాలుగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
Also Read : ఆఫ్ ది రికార్డు వార్తలు.. పుకార్లు..!
రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఈ సమాచారాన్ని బయటపెట్టారు. మజుందార్ పంచుకున్న గణాంకాల ప్రకారం, 2023లో 9.08 లక్షలకు పైగా భారతీయులు చదువు కోసం విదేశాలకు వెళ్లారని తెలిపారు. ఆ సంఖ్య 2024లో 7.7 లక్షలకు, 2025లో 6.26 లక్షలకు తగ్గిందన్నారు. 2023 నుండి 2025 కాలానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అందించిన సమాచారం ఆధారంగా ఈ డేటాను మంత్రి విడుదల చేసారు.
Also Read : బూమ్రాకు ప్రత్యామ్నాయం ఎక్కడ..?
విదేశాల్లో చదువు అనేది వ్యక్తిగత లక్ష్యాలు, ఎమ్పికలకు సంబంధించిన విషయంగా పేర్కొన్నారు. ఆర్థిక స్థోమత, బ్యాంకు రుణాలను పొందే అవకాశం, విదేశీ పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. దేశంలో ఉన్నత విద్య నాణ్యతను మెరుగుపరచడానికి జాతీయ విద్యా విధానం 2020 కింద ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. వీటిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటుగా అక్రిడిటేషన్ను బలోపేతం చేయడం, పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి అంశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.

