తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించన నెయ్యిలో కల్తీ జరిగిందా..? అసలు పాలు, పెరుగు లేకుండానే రసాయనాలతో తయారు చేసిన నెయ్యి లాంటి పదార్థం నిజంగానే వినియోగించారా..? నెయ్యి లేకుండా కల్తీ జరిగిందా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. ప్రసాదం తయారీలో వినియోగించింది నెయ్యి కాదని.. అసలు నిజమైన నెయ్యి వాడలేదని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా టీడీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. కానీ మండలిలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ పయ్యావుల చేసిన వ్యాఖ్యలు.. అటు ముఖ్యమంత్రిని, ఇటు డిప్యూటీ సీఎం సహా.. కూటమి సర్కార్ను ఇరుకున పెడుతున్నాయి.
Also Read : దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. కారణం ఏంటీ..?
నిజానికి నెయ్యి లేకుండా అలాంటి పదార్థంతో లడ్డూలు తయారు చేశారనేది తొలి నుంచి కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించింది నిజమైన నెయ్యి కాదని.. రసాయనాలతో తయారు చేసిన పదార్థం అని సిట్ అధికారులు ఇప్పటికే కోర్టుకు నివేదిక సమర్పించారు. కల్తీ జరిగిన మాట నిజమే అంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఒప్పుకున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు హెరిటేజ్ అంటూ వైసీపీ నేతలు కొత్త వివాదానికి తెర తీశారు. సీఎం సొంత సంస్థకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చ అనంతరం మండలిలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
అయితే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ పయ్యావుల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిజమైన నెయ్యి అసలే లేదు.. అంత మోసం జరిగిందని ఓ వైపు అధికారులు నివేదిక సమర్పిస్తే.. పయ్యావుల మాత్రం.. కల్తీ నెయ్యిపై ఎన్ని రోజులైనా చర్చిద్దాం అంటూ విపక్షానికి సవాల్ విసిరారు. అదే సమయంలో నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు. నిజానికి కల్తీ నెయ్యికి, నెయ్యిలో కల్తీకి చాలా తేడా ఉంది. సిట్ నివేదికలో నెయ్యిలో కల్తీ అనే మాట లేదు. కల్తీ నెయ్యి అని స్పష్టంగా ఉంది. అయితే ఈ మాటను మండలిలో చెప్పడంలో మంత్రి పయ్యావుల సహా టీడీపీ ఎమ్మెల్సీలు విఫలం అయ్యారనే మాట వినిపిస్తోంది. అసెంబ్లీకి జగన్ సహా వైసీపీ నేతలు రావటం లేదు.. కాబట్టి.. అక్కడ ఏం జరిగినా పెద్ద ఇబ్బంది రాదు. కానీ మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు పదే పదే వాదనలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తప్పుపట్టేందుకు ఏ చిన్న అంశం దొరుకుతుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Also Read : నాడు వద్దన్న అదానీ సోలార్.. నేడు ముద్దయింది
మండలిలో తమకు కలిసి వచ్చిన చర్చను, పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకోవడంలో విఫలం అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టసభలో వైసీపీ అబద్దాల పురాణాలు చెబుతుంటే.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు శ్రద్దగా వింటున్నారేమిటి..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తిరుమల లడ్డు అంశంలో మండలిలో మాత్రమే ఇప్పుడు చర్చ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీలు కూడా హాజరవుతున్నారు. వారిని గట్టిగా నిలువరించాల్సిన టీడీపీ మంత్రులు, ఎమ్మెల్సీలు సైలెంట్ అయ్యారనేది వాస్తవం. ఇక మంత్రి పయ్యావుల చేసిన ప్రసంగంపై అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆయనకు ఈ విషయంపై పూర్తి అవగాహన ఉందా అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
మండలిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కల్తీ నెయ్యి అంశంపై మండలిలో మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు మాత్రమే మాట్లాడుతున్నారు. పయ్యావుల కల్తీ నెయ్యికి బదులుగా నెయ్యిలో కల్తీ అని పదే పదే చెబుతున్నారు. ఇక అచ్చెన్నాయుడు తీరు చూస్తే మాత్రం.. పోరాటం కంటే కూడా.. గుర్తింపు కావాలనే ఆరాటం కనిపిస్తోందని సొంత పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు మండలిలో అచ్చెన్న తాపత్రయ పడుతున్నారనేది పార్టీ నేతల మాట. ఏదీ ఏమైనా.. వైసీపీ నేతల ఆరోపణలను మండలిలో సమర్థంగా తిప్పికొట్టడంలో.. టీడీపీ నేతలు పూర్తిగా విఫలం అయ్యారనే చర్చ జోరుగా జరుగుతోంది.

