భారత మోటార్ సైకిల్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ అంతర్జాతీయ వేదికపై దేశం గర్వించే ఘనతను సాధించింది. 2026కు గాను విడుదలైన ‘బ్రాండ్ ఫైనాన్స్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ’ నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆటోమొబైల్ బ్రాండ్ల జాబితాలో రాయల్ ఎన్ఫీల్డ్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ అరుదైన మైలురాయిని చేరుకునే క్రమంలో ఫెరారీ, ఆడి మరియు పోర్షే వంటి ప్రపంచ స్థాయి లగ్జరీ కార్ల తయారీ సంస్థలను సైతం వెనక్కి నెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ జాబితాలో రాయల్ ఎన్ఫీల్డ్ కంటే ముందు కేవలం జపాన్ దిగ్గజం టయోటా మరియు జర్మనీకి చెందిన బిఎమ్డబ్ల్యూ మాత్రమే ఉన్నాయి.
Also Read : వాసు డిమాండ్ వెనుక మతలబు ఏమిటో..!
బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ తన బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ లో 100కి గాను 88.9 స్కోరును సాధించి, అత్యున్నతమైన ‘ఏఏఏ’ రేటింగ్ను దక్కించుకుంది. కేవలం బ్రాండ్ విలువలోనే కాకుండా ఆర్థికంగా కూడా ఈ సంస్థ భారీ వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ బ్రాండ్ విలువ 30 శాతం పెరిగి ప్రస్తుతం 1.2 బిలియన్ డాలర్లకు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.10,000 కోట్లు చేరుకుంది. ఒకప్పుడు కేవలం రెట్రో లుక్ బైక్ లకే పరిమితమైన ఈ బ్రాండ్, నేడు గ్లోబల్ మార్కెట్లో ఒక బలమైన శక్తిగా ఎదిగింది.
Also Read : 2028 నుంచి ఐపీఎల్లో భారీ మార్పులు..!
రాయల్ ఎన్ఫీల్డ్ ఈ స్థాయికి చేరుకోవడానికి దాని అంతర్జాతీయ విస్తరణే ప్రధాన కారణం. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో తన కార్యకలాపాలను సాగిస్తోంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ను అందుకోవడానికి ఏడు విదేశీ అసెంబ్లీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా యూరప్, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ బైక్ లకు క్రేజ్ భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్కు 3,200కు పైగా రిటైల్ అవుట్ లెట్లు ఉన్నాయంటే దాని నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హంటర్ 350, సూపర్ మెటియార్ 650 వంటి మోడళ్లు యువతను విపరీతంగా ఆకట్టుకోగా, కొత్తగా వచ్చిన హిమాలయన్ 450 అడ్వెంచర్ బైక్ ప్రియులను మెప్పించింది. క్లాసిక్ లుక్ తో పాటు ఆధునిక సాంకేతికతను జోడించడమే ఈ బ్రాండ్ సక్సెస్ మంత్రంగా నిలిచింది.

