తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర రాజకీయ, పరిపాలనా సంచలనాలకు దారితీసింది. పవిత్ర గోదావరి నది కాలుష్య కోరల్లో చిక్కుకోవడంపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా నిన్న, ఈరోజు ఉదయం జరిగిన సమీక్షల్లో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల రేవు వరకు బోటులో ప్రయాణించిన పవన్ కల్యాణ్, గోదావరి కాలుష్య తీవ్రతను స్వయంగా పరిశీలించారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..!
ఈ సందర్భంగా పక్కనే ఉన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను ఉద్దేశించి “టూరిజం శాఖ మంత్రిగా గోదావరి కాలుష్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది కాదా..?” అని నిలదీశారు. కేవలం పుష్కరాల రేవులను అందంగా తీర్చిదిద్దితే మీ బాధ్యత సరిపోతుందా అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ, రాజమండ్రి పేపర్ మిల్లు వ్యర్థాలను నదిలోకి వదులుతోందని, వారిపై తాము నిరంతరం యుద్ధాలు చేస్తున్నామని డిప్యూటీ సీఎంకు వివరణ ఇచ్చారు.
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, పీసీబీ అధికారులతో పవన్ కల్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం పవన్ కల్యాణ్ తక్షణమే రూ.100 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఆరు నెలల్లో క్షేత్రస్థాయిలో మార్పు కనిపించేలా గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిన్న అధికారికంగా ప్రకటించారు.
Also Read : కావలి ఎమ్మెల్యేలో మార్పు రాదా..? చర్యలకు రంగం సిద్దం..?
పరిశ్రమల అభివృద్ధి అవసరమే అయినా కాలుష్యాన్ని భరించేది లేదని సమీక్షలో పవన్ స్పష్టం చేశారు. ఆంధ్రా పేపర్ మిల్లు తక్షణమే కొత్త వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గోదావరి నదిలోకి ఏయే ప్రాంతాల నుంచి వ్యర్థాలు కలుస్తున్నాయో తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ధతిలో పూర్తిస్థాయి పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని, రాజమండ్రిని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలని పిలుపునిచ్చారు.

