దేశంలోని గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను పూర్తిగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతం కోసం 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి గానూ అధికారిక నిధుల పంపిణీ ఉత్తర్వులను జారీ చేసింది. చాలా కాలంగా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్ లకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చే అంశం అని చెప్పవచ్చు.
Also Read : గోదావరి క్లీనింగ్ పై పవన్ సీరియస్.. అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్..!
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ భారీ బడ్జెట్ ను ఆమోదించింది. ఐదేళ్ల కాలానికి గానూ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ స్థానిక సంస్థల కోసం మొత్తం రూ.4,35,236 కోట్ల గ్రాంట్ను కేంద్ర ఆర్థిక శాఖ సిఫార్సు చేసింది. కేంద్రం విడుదల చేసే ఈ నిధులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, నేరుగా క్షేత్రస్థాయిలోని స్థానిక సంస్థల అధికారిక ఖాతాల్లోకే జమ కానున్నాయి. కేంద్రం కేటాయించిన ఈ భారీ నిధుల్లో తెలుగు రాష్ట్రాలకు సింహభాగం దక్కింది.
రెండు రాష్ట్రాలకు కలిపి దాదాపు రూ.26,500 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రూ.16,627 కోట్లు, తెలంగాణకు రూ.9,968 కోట్లను కేటాయించారు. ఈ భారీ నిధుల ద్వారా రెండు రాష్ట్రాల పరిధిలోని వేలాది గ్రామ పంచాయతీలలో నిధుల లేమితో నిలిచిపోయిన పనులన్నీ ఇకపై వేగంగా పూర్తి కానున్నాయి. ఈ నిధుల వినియోగానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
Also Read : దుమారం రేపుతున్న సీజేఐ వ్యాఖ్యలు.. ఎందుకిలా..!
ఈ నిధులను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లలో కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే వినియోగించాల్సి ఉంటుంది. పల్లెటూళ్లలో సిసి రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా మెరుగుపరచడం, డ్రైనేజీ వ్యవస్థల ఆధునికీకరణ మరియు పారిశుధ్య నిర్వహణ వంటి ప్రజా ఉపయోగకర పనులకు మాత్రమే వీటిని వాడాలి. ఈ నిధులను సిబ్బంది వేతనాలు లేదా ఇతర పరిపాలనా ఖర్చుల కోసం ఉపయోగించరాదని కేంద్రం ఖచ్చిత నిబంధన పెట్టింది.

