ఏపీ డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుడిగాలి పర్యటన చేశారు. రాజమండ్రి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పుష్కర ఘాట్ల అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన వసతులపై డిప్యూటీ సీఎంకు మ్యాప్ ల ద్వారా సమగ్రంగా వివరించారు. సమీక్ష అనంతరం పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలనకు దిగారు.
Also Read : మోదీ 3.0.. ముహుర్తం ఫిక్స్..!
గోదావరి పుష్కర ఘాట్లను బోటులో ప్రయాణిస్తూ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా ప్రసిద్ధ కోటిలింగాల ఘాట్ వద్ద బోటు దిగిన ఆయన, అక్కడి నుంచి నల్ల కాలువ చానల్ వరకు నడిచి వెళ్లారు. అక్కడ జరుగుతున్న మురుగునీటి శుద్ధి ప్రక్రియను అత్యంత నిశితంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం, శుద్ధి చేసిన నీటిని నదిలోకి వదిలే ప్రాంతాన్ని కూడా పర్యవేక్షించారు. నదీ జలాలు కలుషితం కాకుండా మురుగునీటిని శాస్త్రీయంగా శుద్ధి చేయాలని అధికారులకు కీలక దిశా నిర్దేశం చేశారు.
Also Read : బండి ఫ్యూచర్ ప్లాన్ ఏమిటీ..?
ఈ పర్యటనలో గోదావరి నది కాలుష్యంపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నది కలుషితం కావడానికి గల కారణాలపై అధికారులను ఆరా తీసిన ఆయన, క్లీన్ కృష్ణా, గోదావరి మిషన్ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి నదిలో కలవడానికి వీల్లేదని స్పష్టం చేసారు. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను ఆదేశించారు.

