ఆంధ్రప్రదేశ్ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు.. అంకెలకు అతీతమన్నారు పయ్యావుల. బడ్జెట్ ప్రవేశ పెట్టె ముందు బడ్జెట్ ప్రతులను ఇంద్ర కీలాద్రి అమ్మ వారి వద్ద ఉంచి అధికారులు పూజలు నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి – ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం తమదని తెలిపిన మంత్రి.. సాగునీటి కోసం ఎదురుచూసే రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేదన్నారు.
Also Read : కేటీఆర్కు దిమ్మ తిరిగే దెబ్బ కొట్టిన కవిత..!
రూ.3,32,205 కోట్లతో 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2026-27 వార్షిక బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా పయ్యావుల ప్రకటించారు. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868 కోట్లుగా ఉంది. 2026-27 ఏపీ వార్షిక బడ్జెట్లో కీలక ప్రాజెక్టులు, పథకాలకు కేటాయింపులు చేసింది ఏపీ ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు.. పోలవరం నిర్మాణానికి రూ.6,105 కోట్లు కేటాయించింది సర్కార్.
వీబీ జీ రామ్ జీ పథకానికి రూ.8,365 కోట్లు.. గృహనిర్మాణానికి రూ.5,451 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4,000 కోట్లు కేటాయించగా.. 10 జిల్లాల పరిధితో విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం అభివృద్ధికి రూ.28,000 కోట్లు కేటాయించారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు రూ.30,000 కోట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇక వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చేన్నాయుడు ప్రవేశ పెట్టారు. అటు మండలిలో రాష్ట్ర బడ్జెట్ ను హోం మంత్రి అనిత ప్రవేశ పెట్టగా వ్యవసాయ బడ్జెట్ ను రెవెన్యూ శాఖా మంత్రి అనగాని ప్రవేశ పెట్టారు.
Also Read : లోకేష్ కు జనసైనికులు జై.. ఎందుకలా..?
విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లు రాష్ట్రానికి కీలక గ్రోత్ ఇంజిన్లుగా పయ్యావుల అభివర్ణించారు. నీతి ఆయోగ్తో కలిసి విశాఖ ఎకనామిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. పూర్వోదయ పథకంతో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాకు రూ.9.74 లక్షల కోట్లు అప్పుగా మిగిల్చిందన్నారు. గ్లోబల్ సమ్మిట్లో రూ.13.25 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయన్నారు. పోలవరం ప్రాజెక్టు 60 శాతం పూర్తయిందని తెలిపారు. వంశధార-2, హంద్రీనీవా, పూలసుబ్బయ్య వెలిగొండ, పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్ ను రూ.53,752 కోట్ల అంచనాతో ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

