ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసిన హైకోర్టు, ఈ వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. 2024 ఏప్రిల్ 23 నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడని ప్రకటించింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్లో చేరిన ఆయన, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ పరిణామాలను ఆధారంగా చేసుకొని ఆయనపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పీకర్ను ఆశ్రయించారు.
Also Read : నిర్ణయం చంద్రబాబు.. పవన్ దే.. జనసేన మంత్రి కీలక కామెంట్స్..!
అయితే, దానం నాగేందర్ పార్టీ మారినట్లు నిరూపించే తగిన ఆధారాలు లేవంటూ స్పీకర్ అనర్హత పిటిషన్ను తిరస్కరించారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరో పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని కీలకంగా పరిగణించింది.
ఎంపీ నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచే అనర్హత
కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి దానం నాగేందర్ నామినేషన్ దాఖలు చేసిన 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయనకు అనర్హత వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆయన వ్యవహారంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం సమర్థనీయం కాదని పేర్కొంటూ ఆ తీర్పును రద్దు చేసింది. ప్రజలు ఒక రాజకీయ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకున్న వ్యక్తి, ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూనే మరో పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలో పరిశీలించాల్సిన కీలక అంశమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. స్పీకర్ ఈ అంశాన్ని సరిగా పరిగణనలోకి తీసుకోలేదన్న వాదనతో న్యాయస్థానం ఏకీభవించినట్లు సమాచారం.
Also Read : ఎల్నినో పై బాబు సర్కార్ వార్.. రైతన్నకు కొండంత భరోసా!
హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఒక గంట సమయం ఇవ్వాలని కోరారు. అప్పటివరకు తీర్పు అమలును సస్పెండ్ చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పు తక్షణమే అమల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది.
ఖైరతాబాద్లో ఉప ఎన్నిక?
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమవుతుందని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఉపశమనం లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అయితే, ఉప ఎన్నిక నిర్వహణపై తుది స్పష్టత న్యాయపరమైన తదుపరి పరిణామాలు, ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగా రానుంది.
దానం నాగేందర్ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ఎమ్మెల్యేల కేసులపైనా ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

