ఇస్లాం మతస్తుల అత్యంత పవిత్ర నగరమైన మక్కాలో చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా తొలిసారిగా వైమానిక దాడి హెచ్చరికలు జారీ అయ్యాయి. యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతు ఇస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో సౌదీ పౌర రక్షణ విభాగం ఈ అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. మక్కాతో పాటు పక్కనే ఉన్న ప్రధాన నగరాలైన జెద్దా, తైఫ్ ప్రాంతాలలో కూడా ఈ అలర్ట్ ప్రకటించి, ఆ తర్వాత కొద్దిసేపటికే ఉపసంహరించుకున్నారు.
Also Read : ఏపీలో ఉద్యోగాల జాతర.. మరో గుడ్ న్యూస్..!
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మదీనాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే విమాన సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై అత్యంత భారీ ఎత్తున దాడులకు తెగబడుతున్నారు. ఈ వారంలో జరిగిన డ్రోన్, బాలిస్టిక్ క్షిపణి దాడుల కారణంగా సౌదీలోని పలు చమురు నిల్వ కేంద్రాలు అగ్నిగీలకుల ఆహుతవడమే కాకుండా, సుమారు 73 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే మక్కా నగరంలోని ‘నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్ఫారమ్’ ద్వారా ప్రజలను అలర్ట్ చేశారు.
Also Read : ఏపీ పట్టణాలకు మహర్దశ.. భారీ ప్రాజెక్ట్ లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
అయితే ప్రస్తుతానికి మక్కాలో ప్రమాదం తప్పిందని, అత్యవసర పరిస్థితులు ఉంటే తమను సంప్రదించాలని అక్కడి ప్రభుత్వం ప్రకటన చేసింది. మరోవైపు, పవిత్ర మక్కా నగరాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నామన్న వార్తలను ఖండించింది. సౌదీ చెప్తున్నవన్నీ పాత అబద్ధాలని కొట్టిపారేస్తూనే, తమపై జరుగుతున్న దాడులకు ప్రతిచర్యగా సౌదీపై సైనిక దాడులు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. యెమెన్ అంతర్యుద్ధం కారణంగా ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై హౌతీలు దాడులు చేస్తుండటంతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఇరు దేశాల వివాదం కారణంగా ‘బాబ్ అల్-మందాబ్’ జలసంధి మూతపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుందని ఖతార్ హెచ్చరించింది.

