ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక సంచలన ప్రకటన చేశారు. తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించి అందరినీ షాక్ కు గురి చేసారు. తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏ రకమైన పోటీలోనూ నిలబడబోవడం లేదని స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన అయ్యన్నపాత్రుడు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు కూటమి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Also Read : తెలంగాణలో రేపే మంత్రివర్గ విస్తరణ..? రేసులో ఉన్న ఆ నలుగురు నేతలు వీళ్లే..!
తాను ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణాన్ని కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగా పంచుకున్నారు. ప్రస్తుతం తన వయసు రీత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలని అనుకుంటున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది. తనకు ఇప్పటికే 70 సంవత్సరాల వయసు దాటిపోయిందని, ఇకపై మునుపటిలా నియోజకవర్గమంతటా విస్తృతంగా తిరగడం, ప్రజల మధ్య నిరంతరం అందుబాటులో ఉండటం శారీరకంగా సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : నేపాల్ తర్వాత భారత్..? హిమాలయాల్లో పొంచి ఉన్న ముప్పు..!
వయసు పైబడటం వల్లే తాను గౌరవప్రదంగా రాజకీయాల నుండి తప్పుకోవాలనే ముగింపు నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు. ఇదే సమయంలో తన నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలకు, అనుచరులకు ఆయన ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉందని, నియోజకవర్గానికి ఏం చేయాలన్నా ఈ 3 ఏళ్లేనని ఆయన గుర్తుచేశారు. ఈ మిగిలిన కొద్ది కాలంలోనే పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేసి, నర్సీపట్నాన్ని అభివృద్ధి పథంలో నిలబెడతానని హామీ ఇచ్చారు. మిగిలిన పదవీకాలాన్ని నియోజకవర్గ అభ్యున్నతికే అంకితం చేస్తానని స్పీకర్ స్పష్టం చేశారు.

