విజయవాడలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూటమి ప్రకటన విడుదల చేయడంతో ఆశావహుల ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండే విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై ఈసారి జనసేన కన్నేసింది. నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఎన్టీఆర్ జిల్లా నుంచి జనసేన పార్టీకి ఇవ్వకపోవడంతో ఎలాగైనా మేయర్ స్థానం తమకే ఇవ్వాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానం జనసేన ఆశించినప్పటికీ అనూహ్య పరిణామాల మధ్య బీజేపీకి సీటు కేటాయించడంతో అప్పుడే విజయవాడ మేయర్ స్థానం జనసేనకు ఇవ్వాలన్న అగ్రిమెంట్ కూడా కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేయర్ ఎన్నిక ప్రత్యక్ష ఎన్నికల నేపథ్యంలో కూటమి నుంచి పదవి ఆశించే నేతలు ఇప్పటికే ఈ అంశంపై అనుకూల, ప్రతికూల అంశాలపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఎవరి సమీకరణల్లో వారు తలమునకలై ఉన్నారు.
Also Read : వైసీపీ నేతలను జగన్ కావాలనే రెచ్చగొడుతున్నారా..?
రాష్ట్ర రాజకీయ రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న విజయవాడ సగర మేయర్ పీఠం ప్రత్యేకత ఉంది. ఈసారి విజయవాడ మేయర్ ఎవరు అనే అంశం అయితే చాలా వరకు చర్చకు వస్తోంది. ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ ఆశావాహులు మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగి తేలుతున్నారు. సాధారణంగా నగరంలోని డివిజన్లలో గెలుపొందిన కార్పొరేటర్లలొ ఎవరికైతే మెజార్జీ ఉంటుందో వారిలో నుంచి ఒకరిని మేయర్గా ఎన్నుకునేవారు. అయితే ఈసారి మేయర్ స్థానానికి కూడా ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పోటీ పెరుగుతోంది. ప్రజలే నేరుగా మేయరును ఎన్నుకోనుండడంతో ఈ స్థానానికి కేటాయించే అభ్యర్థి ఎంపికలో పార్టీలు ఆచితూచి అడుగువేస్తున్నాయి.
ఎవరిని పడితే వారిని మేయర్ అభ్యర్ధిగా నిలబెట్టి చేతులు కాల్చుకునేందుకు ఏ పార్టీలు కూడా సిద్ధంగా లేవు. అయితే తమ పార్టీకే మేయర్ ఇస్తామని ఇప్పటికే ఒప్పందం కూడా జరిగిపోయిందని జనసేన నాయకులు బాహాటంగా ప్రకటిస్తున్నా, ఈ అంశంపై టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం స్పందించడం లేదు. అయితే తమ పార్టీ అధినేత ఆదేశాల మేరకు పనిచేస్తామంటూ పైకి చెబుతున్నా.. వారు కూడా అంతర్గతంగా మేయర్ స్థానం టీడీపీకి కేటాయిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు బీజేపీ కూడా రాష్ట్రంలో పట్టు పెంచుకొనే పనిలో పడింది. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నం, విజయవాడ మేయర్ పీఠాలను తమ ఖాతాలో వేసుకోవాలన్న నిశ్చయంతో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కూటమిలో కీలక నేతలు ఈ అంశంపై నోరు మెదపకున్నా.. ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు.
Also Read : విశాఖకు మణిహారం.. ప్రముఖ ఆస్పత్రి వచ్చేసింది.
జనసేన ద్వితీయ శ్రేణి నేతల ఆశలకు రెక్కలు తొడిగాయి. ఎలాగైనా మేయర్ పీఠం అధిష్టించాలని ఎవరికి వారే వారి స్థాయిలతో పాటు ఆర్థిక, అంగ బలప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు. ఆ సీటుకు తాము ఎంతవరకు న్యాయం చేయగలమన్న అంశంపై కూడా ఆలోచిస్తూ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. పరోక్ష పద్ధతి అయితే మేయర్ అభ్యర్థిపై తీవ్రస్థాయిలో లాబీయింగ్ జరిగేది. అయితే ఇప్పుడు ప్రత్యక్ష పద్ధతి కావడంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా జనసేన పార్టీ నుండి అమ్మిశెట్టి వాసు, శంకరులు మేయర్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు పది మంది ఆశావహులు పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
దేశ వ్యాప్తంగా జెన్ జీ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇటీవల న్యూఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఆందోళనలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రాజకీయ నాయకులంతా జెన్ జీకి పట్టం కట్టాలని చూస్తున్నారు. సీనియర్ నేతలు వారి వారసులను జెన్ జీగా మేయర్ పీఠం ఇప్పించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన నుంచి చాలా మంది పోటీ పడుతున్నా వారిలో అమ్మిశెట్టి వాసు, బాడిత శంకర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పవన్తో మంచి సంబంధాలు ఉన్న ఈ ఇద్దరు నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

