ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న యాపిల్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ‘యాపిల్ పే’ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్ నాటికి యాపిల్ పే దేశంలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దేశంలో ఐఫోన్ అమ్మకాలు విపరీతంగా పెరగడం, అదే సమయంలో డిజిటల్ చెల్లింపులకు ఆదరణ పెరగడంతో యాపిల్ సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పటికే దేశీయ డిజిటల్ చెల్లింపుల రంగాన్ని ఏలుతున్న ‘యూపీఐ’కి యాపిల్ పే ఏ మేరకు పోటీ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : కూటమిలో అంతర్గతంగా అసహనం.. నిజమేనా..?
భారతదేశంలో మనం వాడుతున్న గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ అన్నీ ఫోన్ నంబర్లు లేదా క్యూఆర్ కోడ్ల ఆధారంగా నేరుగా బ్యాంక్ ఖాతాల ద్వారా పనిచేస్తాయి. కానీ యాపిల్ పే పూర్తిగా ‘నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్’ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే, కస్టమర్లు తమ ఐఫోన్ లేదా యాపిల్ వాచ్ను పేమెంట్ టెర్మినల్స్ వద్ద కేవలం ఒకసారి ‘టాప్’ చేయడం ద్వారా సులభంగా పేమెంట్స్ పూర్తి చేయవచ్చు. శాంసంగ్ పే తరహాలోనే ఇది కూడా క్రెడిట్, డెబిట్ కార్డ్ నెట్వర్క్లను అనుసంధానించుకుని పనిచేస్తుంది.
Also Read : ఈడీ సోదాలు.. వైసీపీ కొత్త నాటకం..!
భద్రత పరంగా చూస్తే యూపీఐ చెల్లింపుల కోసం మనం 4 లేదా 6 అంకెల పిన్ నంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా యాపిల్ పేలో బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే.. టచ్ ఐడీ లేదా ఫేస్ ఐడీ ద్వారా మాత్రమే పేమెంట్ పూర్తవుతుంది. ప్రైవసీ విషయంలో యాపిల్ పే చాలా సురక్షితమైనది. ఎందుకంటే, ఇది డివైజ్ టోకనైజేషన్ పద్ధతిని వాడుతుంది, దీనివల్ల మనం షాపింగ్ చేసే వ్యాపారులకు మన అసలు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నంబర్లు అస్సలు కనిపించవు. అయితే, యాపిల్ పే కేవలం ఐఫోన్, యాపిల్ వాచ్ వంటి యాపిల్ డివైజ్లలో మాత్రమే పనిచేస్తుంది, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది అందుబాటులో ఉండదు.

