కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా వేయికళ్లతో ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు జలాలు త్వరలోనే మెట్ట భూములను తడపనున్నాయి. వర్షాధారం మినహా మరే ఇతర నీటి వనరులు లేక, తాగడానికి కూడా నీరు దొరకక ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కుకున్న ఈ కరువు ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా శాశ్వత విముక్తి లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేయడంతో ఈ నెలాఖరులోనే ఈ ప్రాంతంలో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : దామచర్లపై బాలినేని మరోసారి సంచలన కామెంట్స్
శ్రీశైలం సమీపంలోని కృష్ణానది.. కొల్లం వాగు నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్కు నీటిని తరలించేందుకు నల్లమల కొండల్లో 18.8 కిలోమీటర్ల నిడివితో రెండు సమాంతర సొరంగాలు తవ్విన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రెండో సొరంగంలో మిగిలిపోయిన లైనింగ్ పనులను ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేసేలా జలవనరుల శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ, గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Also Read : అంతా గందరగోళం.. కేంద్రానికి వరుస షాకులు..!
ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. జూరాల నుంచి శ్రీశైలానికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. ఈ లీన్ పీరియడ్ను వాడుకుని వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్కు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆనకట్టల ఆధారంగా నిర్మించిన నల్లమల సాగర్ రిజర్వాయర్కు, ఆపై 21.8 కిలోమీటర్ల మేర ఉన్న ఫీడర్ కాల్వ ద్వారా ఈ నెలాఖరుకల్లా నీరు చేరనుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, ఈ ప్రాజెక్టు ప్రారంభంతో మార్కాపురం, పెద్దారవీడు, అర్ధవీడు, కనిగిరి ప్రాంతాల ప్రజల దశాబ్దాల కరవు తీరడం ఖాయం.

