ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ, సరికొత్త చరిత్రకు భోగాపురం వేదికైంది. ప్రతిష్ఠాత్మక భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ రన్వేపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ నూతన అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే పై ఒక విమానం ల్యాండ్ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ప్రధాని మోదీకి.. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు.
Also Read : వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు.. లోకేష్ మాస్ వార్నింగ్..!
ప్రధాని మోదీ రాకతో భోగాపురం విమానాశ్రయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ఈ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే వేలాది మంది గిరిజన మహిళల సాంప్రదాయ ‘ధింసా’ నృత్య ప్రదర్శనను ప్రధాని మోదీ ఈ సందర్భంగా వీక్షించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక భోగాపురం వేదికగానే ఉత్తరాంధ్ర సహా యావత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతమిచ్చే వేల కోట్ల రూపాయల విలువైన పలు కీలక ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపనలు చేయనున్నారు.
Also Read : అంతర్జాతీయ అద్భుతం.. మన భోగాపురం..!
ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక, పర్యాటక రంగాల వృద్ధి మరింత వేగవంతం కానుంది. కొత్తగా ఏర్పడబోయే ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ స్థాయి రవాణా సదుపాయాలు ఈ ప్రాంత రూపురేఖలను మార్చనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతతో పాటు, ఈ మహత్తర వేడుకను వీక్షించేందుకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో భోగాపురం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

