భారత క్రికెట్ జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పునరాగమనంపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే ప్రపంచ కప్ జట్టులో భువనేశ్వర్ కుమార్ను చేర్చాలని అశ్విన్ సెలెక్టర్లకు, జట్టు యాజమాన్యానికి సూచించారు. 2022 డిసెంబర్ తర్వాత భారత్ తరఫున వన్డే మ్యాచ్ లు ఆడనప్పటికీ, అతడికున్న అనుభవం, ఇటీవలి ఫామ్ జట్టుకు ఎంతో అవసరమని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా అభిప్రాయపడ్డారు.
Also Read : భోగాపురం.. మూడు రాష్ట్రాల పవర్ హౌస్
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ లో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తూ.. ఏకంగా 28 వికెట్లను పడగొట్టారు. ఈ అద్భుత ఫామ్ ను పరిగణనలోకి తీసుకుని, రాబోయే వరల్డ్ కప్ కోసం భువీని సిద్ధం చేయాలని అశ్విన్ అన్నారు. వరల్డ్ కప్ జరగబోయే దక్షిణాఫ్రికాలోని పిచ్ లు స్వింగ్ బౌలింగ్ కు అనుకూలిస్తాయని, అందువల్ల భువీ లాంటి సీనియర్ అక్కడ ఎంతో ప్రభావం చూపగలడని అశ్విన్ విశ్లేషించారు.
Also Read : జనసేనాని ఆన్ డ్యూటీ.. ప్రక్షాళన మొదలు.!
భువనేశ్వర్ కుమార్ ను నేరుగా కాకుండా, ముందస్తుగా దేశీయ టోర్నమెంట్ల ద్వారా సన్నద్ధం చేయాలని అశ్విన్ బోర్డుకు సలహా ఇచ్చారు. “భువనేశ్వర్ కుమార్ను నేను ఖచ్చితంగా జట్టులోకి తీసుకుంటాను. ఈ విషయాన్ని అతనికి స్పష్టంగా చెప్పి.. ఫస్ట్-క్లాస్ క్రికెట్, విజయ్ హజారే ట్రోఫీతో పాటు అన్ని డొమెస్టిక్ టోర్నమెంట్లు ఆడేలా చూడాలి. తద్వారా సౌతాఫ్రికా పర్యటన నాటికి అతడిని పక్కాగా సిద్ధం చేయవచ్చు” అని అశ్విన్ పేర్కొన్నారు. బీసీసీఐ ప్రస్తుతం 2027 వన్డే ప్రపంచ కప్ కోసం ప్రత్యామ్నాయ ఆటగాళ్ల వేటలో ఉన్న తరుణంలో అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

