కేంద్ర ప్రభుత్వ పరిధిలో వృథా ఖర్చులను అరికట్టడంతో పాటు ప్రభుత్వ వనరుల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా “వన్ ఆఫీసర్, వన్ అఫీషియల్ కార్” అంటే ఒక అధికారికి ఒకే ప్రభుత్వ వాహనం విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ సవరించిన నిబంధనల ప్రకారం.. అర్హులైన కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కేటాయించడానికి వీల్లేదు.
Also Read : ఏపీ సహా 3 రాష్ట్రాలపై విజయ్ ఆంక్షలు..!
ఒకవేళ సదరు అధికారి అదనపు బాధ్యతల కింద మరో మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ లేదా ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ బాధ్యతలు చూస్తున్నప్పటికీ, వారికి రెండో అఫీషియల్ కారును ఇవ్వకూడదని స్పష్టం చేసింది. కేంద్ర వ్యయ శాఖ ఒక అధికారిక మెమోరాండం ద్వారా ఈ కొత్త ఆదేశాలను జారీ చేసింది. గతంలో 2022లో రూపొందించిన స్టాఫ్ కార్ గైడ్ లైన్స్ ను మరింత బలోపేతం చేస్తూ, పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో నడిచే ప్రభుత్వ వాహనాలు కేవలం అధికారిక విధులకు మాత్రమే ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పటికే కారు వాడుతున్న ఆఫీసర్ అదనపు బాధ్యతలు స్వీకరిస్తే, పాత వాహనాన్నే కొనసాగించాలి తప్ప, కొత్త సంస్థల నుంచి రెండో కారును మంజూరు చేయరాదు. అలాగే, టూర్లు లేదా అధికారిక విధుల నిమిత్తం తప్ప.. పిఎస్యూలు లేదా అటానమస్ బాడీలకు చెందిన వాహనాలను కేంద్ర అధికారులు వ్యక్తిగత పనులకు వాడటాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ ఆదేశాలు కేవలం కార్ల సంఖ్యను పరిమితం చేయడమే కాకుండా, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేలా ఉన్నాయి.
Also Read : డీఎస్సీ పరీక్ష.. రాజకీయాల కోసమా? లేక ఉద్యోగార్థుల కోసమా?
వివిధ శాఖల్లో ఉపయోగించకుండా మిగిలిపోయిన లేదా అదనంగా ఉన్న సర్ప్లస్ వాహనాలను సురక్షితమైన కస్టడీలో ఉంచాలని, వాటిని అనధికారిక అవసరాలకు ఏమాత్రం వాడకూడదని శాఖాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ నూతన ఆర్థిక క్రమశిక్షణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని వ్యయ శాఖ గట్టిగా అదేశించింది.

