తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ సంచలన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి ల్యాండింగ్ సమయంలో తృటిలో ముప్పు తప్పడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన ముగించుకుని ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానం రాత్రి 8:35 గంటల సమయంలో శంషాబాద్ రన్ వే పై ల్యాండింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.
Also Read : వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు ఏంటి..?
అయితే సరిగ్గా అదే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ల్యాండింగ్ కు సరైన క్లియరెన్స్ రాలేదు. రన్ వేపై ఏదైనా సాంకేతిక అడ్డంకి లేదా ఇతర కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. పరిస్థితిని గమనించిన పైలట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. విమానం రన్ వేను తాకే లోపే అత్యవసరంగా నిర్ణయం తీసుకుని, విమానాన్ని తిరిగి గాల్లోకి లేపారు. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. క్లియరెన్స్ వచ్చే వరకు సుమారు 20 నిమిషాల పాటు ఆ విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
Also Read : సంజు శాంసన్ను పక్కన పెట్టడంపై దుమారం..!
పరిస్థితి చక్కబడిన తర్వాత పైలట్ విమానాన్ని రన్ వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆ విమానంలో మొత్తం 229 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్ గా ల్యాండింగ్ కావడంతో సీఎం భద్రతా సిబ్బందితో పాటు ఎయిర్ పోర్టు అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు.

