ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి అనే పేరుకు ఒక ప్రత్యేకమైన చరిత్ర, బలమైన క్రేజ్ ఉన్నాయి. దివంగత నేత వంగవీటి మోహన రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ అలియాస్ రాధా రాజకీయ భವಿష్యత్తు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తాజాగా ఖాళీ అయిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కసరత్తు నేపథ్యంలో ఆయన పేరు మళ్లీ తెరపైకి రావడం, బెజవాడ నుంచి అమరావతి వరకు తీవ్ర చర్చకు దారితీసింది.
Also Read : బీజేపీకి ఆ రెండు బిల్లులే కీలకం..!
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా విజయవాడ ఈస్ట్ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారు. రాధా తన రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ.. ఇలా నాలుగు ప్రధాన పార్టీల జెండాలు మోశారు. ఇలా పార్టీలు మారడం ఆయన కెరీర్ పై కొంత ప్రభావం చూపినప్పటికీ, కాపు సామాజిక వర్గంలో మరియు రంగా అభిమానుల్లో ఆయనకున్న ఇమేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు.
2024 ఎన్నికల్లో తనకు సీటు రాకపోయినా, ఎలాంటి పదవి లేకపోయినా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేయడంలో వంగవీటి బ్రాండ్ ఇమేజ్ మరియు ఆయన ప్రచారం కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో గవర్నర్ కోటాకు సంబంధించిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉండటంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు.
Also Read : కాపులను రెచ్చగొడుతున్న వైసీపీ.. వర్కవుట్ అవుతుందా..?
ఈ రేసులో దేవినేని ఉమా, పిఠాపురం వర్మ వంటి సీనియర్ల పేర్లు ఉన్నప్పటికీ, సామాజిక సమీకరణాలు మరియు గత ఎన్నికల త్యాగాలను పరిగణనలోకి తీసుకుంటే వంగవీటి రాధాకు ఈసారి మొగ్గు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ కాలంగా అధికారిక పదవులకు దూరంగా ఉంటూ క్యాడర్ ను కాపాడుకుంటున్న రంగా వారసుడికి ఈసారైనా కూటమి ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందో లేదో చూడాలి.

