భారత్ లో ఇటీవల కాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం భారతదేశ జనాభాలో సుమారు 8 నుండి 12 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ వ్యాధి, ఇప్పుడు 20, 30 ఏళ్ల వయసున్న యువతను సైతం విపరీతంగా వేధిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read : 50 దాటిన మహిళలు ఈ విషయంలో జాగ్రత్త..!
ప్రముఖ యూరాలజీ నిపుణులు డాక్టర్ పంకజ్ పన్వర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసుల పెరుగుదలకు ప్రధానంగా మారుతున్న వాతావరణం మరియు జీవనశైలి అలవాట్లే కారణం. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్స్ వల్ల శరీరంలో విపరీతంగా చెమట పట్టి నీటి శాతం తగ్గిపోతుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రం చిక్కబడి, అందులోని ఖనిజాలు కిడ్నీలలో రాళ్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎండలో పనిచేసే కూలీలు, డ్రైవర్లు దీని బారిన ఎక్కువగా పడుతున్నారు.
Also Read : తెలంగాణా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం..!
ప్రస్తుత తరం వారు ఎక్కువగా తీసుకుంటున్న జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ దీనికి ఆజ్యం పోస్తున్నాయి. వీటిలో ఉండే మితిమీరిన ఉప్పు, సుగరీ బెవరేజెస్, ఫ్రక్టోజ్ వంటివి కిడ్నీలలో పేరుకుపోతున్నాయి. అలాగే జంతు ప్రోటీన్ ఎక్కువగా తినడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీరు లభించకపోవడం, నీటిలో కలుషితాలు పెరగడం వల్ల ఈ ముప్పు పెరుగుతోంది. వీటికి తోడు మధుమేహం, ఊబకాయం వంటి జీవక్రియ లోపాలు కూడా కిడ్నీ స్టోన్స్ పెరగడానికి పరోక్ష కారణాలుగా మారుతున్నాయి.
Also Read : సూర్యకుమార్ యాదవ్ రీ ఎంట్రీ ఖాయమా..?
ఈ కిడ్నీ స్టోన్స్ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ తగినంత నీరు.. అంటే కనీసం 3 నుండి 4 లీటర్లు తాగడం అలవాటు చేసుకోవాలి. మూత్రం లేత పసుపు లేదా తెలుపు రంగులో ఉంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉన్నట్లు అర్థం. అలాగే ఆహారంలో ఉప్పు పరిణామాన్ని తగ్గించాలి, ప్యాక్ చేసిన నిల్వ ఆహారాలకు దూరంగా ఉండాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం వల్ల ఈ ముప్పును దాదాపు తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. నడుము లేదా వీపు భాగంలో తీవ్రమైన నొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట లేదా రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం.

