ఆరు దశాబ్దాల పాటు యావత్ భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో ఊగించిన దక్షిణాది స్వరకోకిల, లెజెండరీ సింగర్ ఎస్. జానకి భౌతికంగా దూరమవడం సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కర్ణాటక ప్రభుత్వం ఆమెకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి గౌరవించుకున్నప్పటికీ, ఈ అంతిమ సంస్కారాల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ లో వివాదానికి తెరలేపింది. దశాబ్దాల పాటు తెలుగు సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించి, తెలుగు నేలతో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉన్న జానకమ్మను కడసారి చూసేందుకు టాలీవుడ్ నుండి ఒక్క ప్రముఖుడు లేదా స్టార్ హీరో కూడా మైసూరుకు వెళ్లకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : మళ్లీ బీఆర్ఎస్ వైపు ఈటల అడుగులు.. నిజమేనా..?
సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఎవరైనా చిన్న నటుడు చనిపోయినా లేదా ఇండస్ట్రీకి చెందిన పెద్దల ఇళ్లల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా క్యూ కట్టే టాలీవుడ్ ప్రముఖులు, ఒక సంగీత శిఖరం కన్నుమూస్తే మాత్రం తమ లగ్జరీ ఇళ్లకే పరిమితమయ్యారని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. జానకమ్మ మరణవార్త వినగానే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో “ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ పెద్ద పెద్ద పోస్టులు పెట్టి మమ అనిపించేశారు తప్ప, ప్రత్యక్షంగా వెళ్లి నివాళులర్పించే నైతిక బాధ్యతను ఎందుకు మర్చిపోయారని అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేవలం సోషల్ మీడియా పోస్టులతోనే ఇండస్ట్రీ బాధ్యత తీరిపోయిందా అంటూ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు.
Also Read : చంద్రబాబుకు ఉన్న నీటి సోయి… రేవంత్కు రావాలి!
వెండితెరపై సెంటిమెంట్లు పండించే సినిమా రంగానికి, నిజ జీవితంలో ఒక లెజెండ్ కు ఇవ్వాల్సిన కనీస గౌరవంపై సెంటిమెంట్ లేదా అనే ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీ నైజంపై వస్తున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుండి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అందరి స్టార్ హీరోల చిత్రాలకు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చి, వందల కోట్ల బిజినెస్ కు కారణమైన గాయని పట్ల ప్రదర్శించిన ఈ ఉదాసీనత భవిష్యత్తు తరాలకు మంచి సంకేతం కాదనే విమర్శలు వస్తున్నాయి. బ్రతికి ఉన్నప్పుడు ఆమె పాటలను వాడుకుని, ఆమె శాశ్వతంగా కన్నుమూసినప్పుడు కనీసం ఒక పూలమాల వేయడానికి కూడా సమయం కేటాయించలేకపోయిన టాలీవుడ్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

