గత ఆరేళ్లుగా తెలంగాణ రాజకీయ, అధికార వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏ.బి. వెంకటేశ్వరరావును సుదీర్ఘంగా విచారించింది. ఈ కేసులో పొరుగు రాష్ట్రానికి చెందిన ఒక అత్యున్నత స్థాయి మాజీ పోలీస్ అధికారిని సిట్ విచారించడం ఇదే తొలిసారి కావడంతో ఈ పరిణామం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : పవన్ క్రేజీ ఆలోచన.. ఏంటి ఈ సీడ్ బాల్స్..?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అక్రమంగా నిర్వహించిన నిఘా వ్యవహారాలపై సిట్ విస్తృతంగా ఆధారాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించిన కొన్ని కీలక లింకులు బయటపడటంతో అధికారులు ఆయనకు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచారు. అయితే, ఆయనను ఈ కేసులో నిందితుడిగా కాకుండా, ఒక సాక్షిగా పరిగణిస్తూ ఆయన స్టేట్మెంట్ ను సిట్ అధికారులు అధికారికంగా రికార్డు చేశారు. నాడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు.
Also Read : మళ్లీ బీఆర్ఎస్ వైపు ఈటల అడుగులు.. నిజమేనా..?
అలాగే కొంతకాలం పాటు సస్పెన్షన్కు గురయ్యారు. సరిగ్గా అదే సమయంలో తెలంగాణకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగాలు ఆయన కదలికలపై, ఫోన్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు సిట్ దర్యాప్తులో ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఆయనను ప్రధానంగా మూడు అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నాటి తెలంగాణ అధికారుల నుంచి ఆయనకు ఎలాంటి నిఘా నీడ ఎదురైంది..? ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన కమ్యూనికేషన్లను తెలంగాణ ఎస్ఐబీ ఏ విధంగా ట్రాక్ చేసింది..? తన ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయనే విషయాన్ని ఆయన ఎప్పుడైనా గమనించారా..? దానివల్ల ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి..? ఈ ప్రశ్నలకు సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు సిట్ అధికారులకు పలు కీలక వివరాలను అందజేసినట్లు సమాచారం.

