భారత్ – అమెరికా దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన చట్టపరమైన ముసాయిదాలో కేవలం చివరి 1 లేదా 2 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని భారత్ లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటించారు. ముంబైలో జరిగిన 9వ యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్ లీడర్ షిప్ సమ్మిట్ 2026లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు నిర్దేశించుకున్న 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం.
Also Read : ఎమ్మెల్యేలు.. వారితో తస్మాత్ జాగ్రత్త..!
గత 18 నెలలుగా ఈ ఒప్పందంపై ఇరుదేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయట. ఇటీవలే అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ జామీసన్ లీ గ్రీర్ రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించి, మిగిలిపోయిన కొన్ని అంశాలపై చర్చలు జరిపి దీనికి తుది రూపునిచ్చారు. ఐరోపా దేశాల వాణిజ్య ఒప్పందాలు పూర్తి కావడానికి దాదాపు 20 ఏళ్లు పడుతుందని, కానీ భారత్ తో కేవలం ఒకటిన్నర ఏళ్లలోనే ఈ ఒప్పందం కొలిక్కి రావడం విశేషమని సెర్గియో గోర్ పేర్కొన్నారు.
Also Read : 2018 గ్రూప్ వన్ రద్దు హామీ.. గాలిలో దీపమేనా..?
అంతేకాకుండా, ఈ ఏడాది భారత్ నుండి అమెరికాలోకి ఏకంగా 20.5 బిలియన్ డాలర్ల కొత్త పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. యూరప్ లోని అమెరికా ఎంబసీల కంటే న్యూఢిల్లీలోని ఎంబసీ ఈ విషయంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని ప్రశంసించారు. ఇటీవలే వాషింగ్టన్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో తాను రెండు గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యానని అంబాసిడర్ గోర్ తెలిపారు. ఆ సమయంలో ట్రంప్ తన గత భారత పర్యటనను గుర్తుచేసుకున్నారని, భారతదేశంపై ఆయనకు ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పుకొచ్చారు.

