ఏపీలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అటు ఉగాది, ఇటు రంజాన్ పండుగలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రజలకు వరుస కానుకలు అందిస్తోంది. నిరుద్యోగుల నుంచి దివ్యాంగుల వరకు, పోలవరం నిర్వాసితుల నుంచి మైనార్టీల వరకు అందరికీ మేలు చేకూర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం నుంచి అమలులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది దివ్యాంగుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా వారి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచనుంది.
Also Read : హెరిటేజ్కి రాయితీలు.. అసలు లెక్క ఇది.. తప్పేముంది జగన్..?
నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఎన్నికల హామీ ప్రకారం, సుమారు 10 వేలకు పైగా పోస్టులతో గురువారం ఉగాది పర్వదినం సందర్భంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనున్నారు. ఇందులో గ్రూప్-1 స్థాయి నుంచి కానిస్టేబుల్ పోస్టుల వరకు వివిధ విభాగాల్లో భర్తీలు ఉండనున్నాయి.
గతేడాది 16 వేల పోస్టులతో మెగా DSCని భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మరో 2,600 పోస్టులతో ముందుకు వస్తోంది. కేవలం ఈ ఏడాదికే పరిమితం కాకుండా, రాబోయే మూడేళ్లలో ఏటా DSC ఇచ్చేలా అధికారులు ప్లాన్ రెడీ చేశారు. రిటైర్మెంట్ల ద్వారా ఖాళీ అయ్యే పోస్టులను కలుపుకుని, ఐదేళ్లలో దాదాపు 25 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Also Read : ఏపీలో ఇంద్రధనుస్సు.. దివ్యాంగులకు ఫ్రీ బస్సు..!
ఇక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం మరో విడత పరిహారాన్ని అందించింది. బుధవారం నాడు రూ. 250 కోట్ల పరిహారం చెల్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే దీపావళి, సంక్రాంతి సమయాల్లో రెండు విడతలుగా రూ. 1,980 కోట్లు అందించగా, ఇప్పుడు ఉగాది కానుకగా ఈ నిధులను విడుదల చేయడం జరిగింది.
ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ వేళ ప్రభుత్వం తీపి కబురు అందించింది కూటమి ప్రభుత్వం. ఇమామ్లు, మౌజన్ల వేతనాల కోసం సోమవారం ముఖ్యమంత్రి రూ. 45 కోట్లు విడుదల చేయగా.. కేవలం 20 గంటల వ్యవధిలోనే వారి ఖాతాల్లో జమ అయ్యాయి. రంజాన్ పండుగకు ముందే వేతనాలు అందడంతో ముస్లిం మైనార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కళకళలాడుతోంది. వివిధ వర్గాల ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. నిరుద్యోగుల నుంచి దివ్యాంగుల వరకు అందరికీ భరోసా కల్పించడం వరకు ప్రభుత్వం తనదైన ముద్ర వేస్తోంది.

