ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ విధానం 4.0 కింద హెరిటేజ్ సంస్థ విస్తరణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఏ సంస్థకైనా ప్రభుత్వం కొన్ని రాయితీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశిపెంట్ల గ్రామంలో హెరిటేజ్ సంస్థ తన యూనిట్ను విస్తరించేందుకు హెరిటేజ్ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకుగాను ఆ సంస్థ రూ. 209.69 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ భారీ పెట్టుబడిని గుర్తించిన ప్రభుత్వం, పాలసీ నిబంధనల ప్రకారమే రాయితీలను ఖరారు చేసింది.
Also Read : మైలవరం ఎమ్మెల్యే పర్యటనలో రచ్చ రచ్చ..!
రూ. 209.69 కోట్ల మేర పెట్టుబడులు పెట్టామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని, సంస్థను విస్తరిస్తున్నందున ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద రాయితీలు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి హెరిటేజ్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. గత నెల 18వ తేదీన జరిగిన సమావేశంలో రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఈ దరఖాస్తును పరిశీలించింది. సుదీర్ఘ చర్చ తర్వాత సంస్థకు రూ. 59.69 కోట్లు రాయితీలు ఇవ్వాలని తీర్మానించింది. స్థిర మూలధన పెట్టుబడిలో 25 శాతం కింద టెక్నాలజీ అప్గ్రెడేషన్ కోసం రూ. 34.93 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని, 100 శాతం SGST రాయితీ కింద రూ. 17.80 కోట్లు, విద్యుత్ చార్జీల రీయింబర్స్మెంట్ కింద యూనిట్కు రూపాయి చొప్పున ఐదేళ్లలో రూ. 0.98 కోట్లు, వడ్డీ రాయితీ రెండు శాతం చొప్పున రూ. 5 కోట్లు.. మొత్తంగా రూ. 59.69 కోట్లను ప్రోత్సాహకాల కింద ఇవ్వాలని పేర్కొంది.
ఇందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెరిటేజ్ సంస్థ తన యూనిట్ను విస్తరించడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని ఈ ఉత్తర్వుల ద్వారా స్పష్టమవుతోంది.
Also Read : ఏపీలో ఇంద్రధనుస్సు.. దివ్యాంగులకు ఫ్రీ బస్సు..!
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఏ ఇతర సంస్థకైనా ప్రభుత్వం అందించే పారిశ్రామిక ప్రోత్సాహకాలనే హెరిటేజ్ సంస్థకు కూడా అందించింది. ఇందులో ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు గానీ, అదనపు ప్రయోజనాలు గానీ లేవు. రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 నిబంధనలకు లోబడే ఈ రాయితీలు మంజూరయ్యాయి. అయినప్పటికీ, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని వక్రీకరిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి.

