ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం.. దివ్యాంగుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంద్రధనుస్సు పేరుతో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులకు 100 శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : మైలవరం ఎమ్మెల్యే పర్యటనలో రచ్చ రచ్చ..!
ఈ పథకం కేవలం ప్రయాణానికే పరిమితం కాకుండా, దివ్యాంగుల ఆర్థిక స్వావలంబనకు దారితీసేలా రూపొందించారు. 40 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరూ పల్లె వెలుగు నుంచి మెట్రో ఎక్స్ప్రెస్ వరకు అన్ని సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మరీ ముఖ్యంగా, తీవ్ర వైకల్యం ఉండి తోడుగా ఎవరైనా రావాల్సిన పరిస్థితి ఉంటే, ఆ సహాయకుడికి కూడా టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పించడం ద్వారా ప్రభుత్వం మానవీయ కోణాన్ని చాటుకుంది. పాత రాయితీ పాస్లు ఉన్నవారు వాటితోనే ప్రయాణించవచ్చు, కొత్తవారు సదరం సర్టిఫికేట్, ఆధార్తో సులభంగా పాస్లు పొందవచ్చు.
ఇప్పటికే మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో నిలబడటానికే చోటు లేని పరిస్థితి నెలకొన్న తరుణంలో, దివ్యాంగులు క్షేమంగా బస్సు ఎక్కడం, వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవడం కండక్టర్లకు సవాలుగా మారనుంది. ఈ పథకం ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే, రద్దీకి అనుగుణంగా బస్సుల నిర్వహణలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది.
Also Read : త్రిషకు చెన్నైలోనే సీటు..? విజయ్ టూ అమిత్ షా వయా త్రిష..!
ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ను గుర్తించిన కూటమి ప్రభుత్వం, త్వరలోనే ఆర్టీసీ ఫ్లీట్ను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. పాత బస్సుల స్థానంలో కొత్తవి తీసుకురావడం, ట్రిప్పుల సంఖ్యను పెంచడం ద్వారా రద్దీ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దివ్యాంగులకు వైద్యం, విద్య, ఉపాధి అవసరాల కోసం ఈ ఇంద్రధనుస్సు ఒక గొప్ప వరమని చెప్పాలి.

