బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్ 2026 బహిష్కరణ వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఈ తరహా మెగా టోర్నీల్లో ఆడకపోతే, జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ లో ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ నూతన సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంలో దౌత్య వైఫల్యంపై క్రీడా మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. ఈ బహిష్కరణ వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతిన్నదని భావిస్తున్న క్రీడా మంత్రిత్వ శాఖ, దీనిని ఒక దౌత్య వైఫల్యంగా పరిగణిస్తూ సమగ్ర విచారణకు ఆదేశించింది.
Also Read : త్రిషకు చెన్నైలోనే సీటు..? విజయ్ టూ అమిత్ షా వయా త్రిష..!
ఈ వ్యవహారంపై ఇప్పటికే ఉన్న దర్యాప్తు కమిటీని క్లోజ్ చేయాలని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరిన ఒక రోజు తర్వాత, క్రీడా మంత్రిత్వ శాఖ ఆ అభ్యర్థనను తోసిపుచ్చడమే కాకుండా కొత్త కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీతో చర్చల్లో ఎక్కడ లోపం జరిగింది? ఇతర దేశాల మద్దతు ఎందుకు లభించలేదు? అనే కోణంలో ఈ కమిటీ దర్యాప్తు చేయనుంది. ఐపీఎల్ నుండి ముస్తాఫిజుర్ రెహమాన్ విడుదల కావడం, భారత్ తో దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో, భద్రతా కారణాలను సాకుగా చూపి బంగ్లాదేశ్ భారత్ లో ఆడటానికి నిరాకరించింది.
Also Read : మైలవరం ఎమ్మెల్యే పర్యటనలో రచ్చ రచ్చ..!
అయితే, ఐసీసీ దీనిని భద్రతా సమస్యగా గుర్తించకపోవడంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ను టోర్నీలోకి తీసుకొచ్చింది. బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన తర్వాత.. దీనికి నిరసనగా, భారత్ లో జరిగే ప్రపంచ కప్ మ్యాచ్ లను తటస్థ వేదికలకు మార్చాలని బీసీబీ పట్టుబట్టింది. ఐసీసీ ఇందుకు అంగీకరించకపోవడంతో, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ యువజన, క్రీడల శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ మాట్లాడుతూ, రంజాన్ పండుగ తర్వాత ఈ విచారణ కమిటీ విచారణ మొదలుపెడుతుందని పేర్కొన్నారు. కేవలం భద్రతా కారణాలేనా లేక అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల దేశం ఇంత పెద్ద టోర్నీని కోల్పోయిందా అనే విషయాన్ని విచారణలో తేల్చనున్నారు.

