‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుక సందర్భంగా చేసిన ప్రసంగంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో నిన్న చిత్రబృందం ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. వేలాది మంది అభిమానులు హాజరైన ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా ప్రమోషన్ల విషయంలో అభిమానుల్లో ఏర్పడిన కొంత అనుమానాన్ని ఈ ఈవెంట్ పూర్తిగా తొలగించినట్లు కనిపించింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనంతరం ఓవర్సీస్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్స్ గణనీయంగా పెరగడం విశేషం.
Also Read : సిట్ ముందుకు అనంత్ బాబు భార్య.. అరెస్ట్ ఖాయమా..?
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే సాధారణ కమర్షియల్ సినిమా కూడా మరింత స్థాయికి చేరుతుందనే విషయాన్ని ఈ ఈవెంట్ మరోసారి నిరూపించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తాను సాధారణంగా తన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడటం ఇష్టపడనని అన్నారు. అయితే ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పే సమయంలో అనేక సన్నివేశాలు తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. సినిమా చాలా ఎంగేజింగ్గా ఉందని, ప్రేక్షకులకు కూడా అదే అనుభూతి కలుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. కేవలం 45 రోజుల్లోనే సినిమా షూటింగ్ పూర్తయిందని, తాను ఎప్పుడు వచ్చి ఎలా షూటింగ్ చేసి వెళ్లానో కూడా అర్థం కాకుండా అంత సులభంగా షూటింగ్ నిర్వహించారని దర్శకుడిని ప్రశంసించారు. ఇలాంటి నిబద్ధత కలిగిన టెక్నీషియన్లు ఉంటే సినిమాలు చేయడం తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. అదే సమయంలో రాజకీయాలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. కొంతమంది రాజకీయ నాయకులు తనపై విమర్శలు చేస్తుంటారని పేర్కొంటూ, రాజకీయాల్లో ఉన్న చాలా మందికి వ్యాపారాలు, కాంట్రాక్టులు ఉంటాయని అన్నారు. తనకు మాత్రం సినిమా అనేది వృత్తి మాత్రమే కాదు, జీవితంలో భాగమని తెలిపారు.
Also Read : ఫామ్హౌస్ ‘రచ్చ’ వెనుక.. దుబాయ్ ‘దందా’..?
“సినిమా నా నరనరాల్లో నాటుకుపోయింది. దాన్ని నా నుంచి వేరు చేయలేరు,” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన సినిమాలకు పూర్తిగా దూరం కావడం లేదని అభిమానులకు స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లైంది. రాజకీయాల కారణంగా మధ్యలో విరామాలు ఉండొచ్చేమో కానీ సినిమాలను మాత్రం కొనసాగిస్తానని ఆయన సందేశం ఇచ్చారు. దీంతో అభిమానులు భవిష్యత్తులో OG వంటి ప్రాజెక్టులకు సీక్వెల్స్ కూడా వచ్చే అవకాశాన్ని ఆశగా చూస్తున్నారు. ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చేసిన పూర్తి ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

