ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం కారణంగా, భారత నౌకలు హార్మోజ్ జలసంధి దాటి రావడం కష్టంగా మారింది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలతో రెండు నౌకలకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ పర్యటన, దౌత్య చర్చల ఫలితంగా హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. దీనిపై ఆయన ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక పరిణామాలను వివరించారు. తాము ఇరాన్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వివరించారు.
Also Read : బీఆర్ఎస్ కు గంపెడు కష్టాలు.. ఏమైనా బయటపడుతుందా..?
ఈ చర్చలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, ప్రస్తుతానికి భారతీయ జెండా ఉన్న నౌకలకు మాత్రమే ఇరాన్ ఈ వెసులుబాటు కల్పించిందని ఆయన తెలిపారు.. అయితే ఇది ఒక స్థిరమైన ఒప్పందం కాదని, ప్రతి నౌక ప్రయాణాన్ని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు. ఇటీవల శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక ‘ఐరిస్ దేనా’ మునిగిపోయినప్పుడు, మరో ఇరాన్ నౌక ‘ఐరిస్ లావాన్’కు భారత్ అత్యవసరంగా కొచ్చి పోర్టులో ఆశ్రయం కల్పించింది. మానవతా దృక్పథంతో భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇరాన్ గౌరవించిందని ఆయన వివరించారు.
Also Read : విజయ్ కొడుకు జాసన్ సంజయ్ షాకింగ్ నిర్ణయం
తాము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలపరిచిందని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ ఇంధన అవసరాల్లో ఎక్కువ భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. కాబట్టి, ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగకుండా, రవాణా ఆగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యత అని జైశంకర్ పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై ఆంక్షలు విధిస్తున్న ఇరాన్, భారత్తో ఉన్న చారిత్రక సంబంధాల దృష్ట్యా మన నౌకలకు మార్గం ఇవ్వడం సంతోషకరమని తెలిపారు.

