మావోయిస్ట్ పార్టీని మార్చ్ 31 నాటికి ఎలాగైనా దేశంలో లేకుండా చేయాలని అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం దాదాపుగా నెరవేరే అవకాశాలే కనపడుతున్నాయి. మావోయిస్ట్ పార్టీ అగ్ర నేతగా భావించే, ముప్పాళ్ళ లక్ష్మణ రావు అలియాస్ గణపతి మరో రెండు రోజుల్లో లొంగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. పార్టీని దశాబ్దాల పాటు ముందు ఉండి నడిపించిన గణపతి ఇప్పుడు.. వయోభార సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పార్టీ కీలక నాయకత్వం మొత్తం జనజీవన స్రవంతిలో కలుస్తున్న నేపధ్యంలో.. గణపతి కూడా తెలంగాణా పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.
Also Read : ఏపీ క్యాబినెట్లో మార్పులు.. ఈసారి వారికే ఛాన్స్..!
అయితే ఆయన తెలంగాణా పోలీసుల ముందు కాదు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోయే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గత కొన్నాళ్ళుగా నేపాల్ లో ఉంటున్న ఆయన.. ఇప్పటికే ఢిల్లీ కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి.. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆపరేషన్ కగార్ తర్వాత ఆయన అడవిని వీడి.. నేపాల్ కు వెళ్ళిపోయారు. గణపతి లొంగిపోతున్నట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం మొదలైంది.
Also Read : పెంచలయ్య సరే.. మరి.. రవి సంగతి ఏమిటీ..?
గణపతి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో అగ్ర నేతల శకం ముగిసినట్లే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లు, త్వరలోనే లొంగిపోయే అవకాశం ఉన్నట్లు గత వారం పది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి నుండి వైదొలిగిన గణపతి, ఆ బాధ్యతలను బసవరాజ్ కు అప్పగించారు. గణపతి వయస్సు, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ జీవితం గడపాలని కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆయనతో టచ్లోకి వెళ్లినట్లు ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి.

