ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ చేరింది. ఉత్కంఠ భరింతంగా సాగిన సూపర్ 8 చివరి మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. సెమీ ఫైనల్ బెర్తు కోసం భారత్, వెస్టిండీస్ జట్లకు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. ఇలాంటి మ్యాచ్లో రాణించిన సంజూ శాంసన్ 97 పరుగులతో నాటౌట్గా నిలిచి.. జట్టును సెమీస్ చేర్చాడు. తొలి నుంచి తన ఆటతీరుపై వస్తున్న విమర్శలకు ఈ మ్యాచ్లో బ్యాట్తో జవాబు చెప్పాడు సంజూ. భారత్ ఇన్నింగ్స్లో తొలి బంతి ఎదుర్కున్న సంజూ.. చివరి బంతిని బౌండరీగా మలిచి.. విక్టరీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. గురువారం జరగనున్న సెమీ ఫైనల్లో టీమిండియా .. ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది.
Also Read : గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి మంత్రి కొండపల్లి భరోసా
అయితే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో కూడా కొందరి ఆటపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్మాషింగ్ ఓపెనర్ అనే పేరున్న అభిషేక్ శర్మ ఆటతీరుపై క్రికెట్ విశ్లేషకులు గుర్రుగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్ సిరీస్లో అభిషేక్ ఆటతీరు నిరాశకు గురి చేసింది. వరుసగా 3 మ్యాచ్లో డకౌట్ అయ్యాడు అభిషేక్. ఆ తర్వాత కూడా ఒకటీ, అరా తప్ప.. పెద్దగా రాణించింది ఏం లేదు. లక్ష్య ఛేదనలో అభిషేక్ ఒత్తిడికి గురవుతున్నాడనే మాట బాగా వినిపిస్తోంది. ఈ టోర్నీలో జింబాబ్వే పై తప్ప.. పసికూన నెదర్లాండ్స్, అమెరికా జట్ల పై కూడా పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు.

వెస్టిండీస్తో మ్యాచ్ గెలిస్తేనే టీమిండియా సెమీ ఫైనల్ చేరుతుంది. ఈ మ్యాచ్లో తొలి నుంచి బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్ చేశారు. అయితే అభిషేక్ చేసిన తప్పుల వల్ల విండీస్ జట్టు భారీ స్కోరు చేసిందనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. 5వ ఓవర్లో రోస్టన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ను అభిషేక్ వదిలేశాడు. అప్పుడు రోస్టన్ స్కోరు 15 రన్స్. ఆ తర్వాత చెలరేగిన రోస్టన్.. 40 రన్స్ చేశాడు. పావెల్ ఇచ్చిన క్యాచ్ కూడా అభిషేక్ వదిలేశాడు. దాని వల్ల చివరి ఓవర్లల్లో విండీస్ బ్యాటర్లు మరో 20 పరుగులు చేసే అవకాశం లభించింది. 150 లోపు ఆగాల్సిన విండీస్ స్కోర్.. చివరికి 4 వికెట్ల నష్టానికి 195 వరకు వెళ్లింది.
Also Read : టార్గెట్ బీఆర్ నాయుడు.. డీప్ ఫేక్ తో వైసీపీ దారుణం
ఇక బ్యాటింగ్లో కూడా అభిషేక్ అదే నిర్లక్ష్యపు షాట్తో పెవిలియన్ చేరాడు. ఓ వైపు సంజూ శాంసన్ ఆచి తూచి ఆడుతుంటే.. అభిషేక్ మాత్రం.. భారీ షాట్కు ప్రయత్నించి.. క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. బంతి గాల్లోకి లేపటం మాత్రమే అనేది అభిషేక్ ఆటతీరు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిలకడగా రాణిస్తేనే పరుగులు వస్తాయనే లాజిక్కు అభిషేక్ మర్చిపోయాడా అని ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లండ్తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మను తప్పించి.. అతని స్థానంలో రింకూ సింగ్ను ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

