ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పదిన్నరేళ్ల పాటు తానే సీఎంగా ఉంటా అని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని రేవంత్ జోస్యం చెప్పారు. అయితే జనగణన, నియోజకవర్గాల పునర్ విభజన, పార్లమెంట్, అసెంబ్లీల్లో సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ అమలు తర్వాతే జమిలి ఎన్నికలు వస్తాయన్నారు. తనకు ఎవరూ పోటీ కాదన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రానికి నేనే రాజు.. నేనే మంత్రి అని వ్యాఖ్యానించారు.
Also Read : స్టూడెంట్ వీసాలపై కేంద్రం కీలక ప్రకటన..!
ఫోన్ ట్యాపింగ్ కేసు సహా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందన్నారు. కేసీఆర్ను అరెస్టు చేసి జైల్లో పెట్టాలనుకుంటే.. అది ఎప్పుడో పెట్టే వాళ్లమన్న రేవంత్.. నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారమే కేసీఆర్ను జైల్లో వేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని భావిస్తున్నా అన్నారు. పారదర్శకంగా విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇవ్వాలని పోలీసులకు చెప్పినట్లు రేవంత్ తెలిపారు. ప్రభాకర్ రావుని విదేశాల నుంచి తీసుకురావడానికి 20 నెలలు పట్టిందని.. అందుకే ఆలస్యం అయ్యిందన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారని రేవంత్ వెల్లడించారు. తాను రాజ్యాంగం ప్రకారమే నడుస్తా అని స్పష్టం చేశారు.
కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్ అసలు విషయంలో దర్యాప్తు ఆధారంగానే ముందుకు వెళతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన 3 గేట్లే కాదు.. మొత్తం ప్రాజెక్టు అధ్యయనం చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబుతోందని రేవంత్ వెల్లడించారు. ప్రాజెక్టు మొత్తం అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీకి ఇచ్చామన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని సాంకేతిక నిపుణులు చెబుతున్నారన్నారు. కేసీఆర్, హరీష్ రావు కోరినట్లు ప్రభుత్వం నడవదని.. మూడు గేట్లకు మరమ్మతులు చేసి ముందుకు వెళితే.. దాని వల్ల ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందని.. ఆ నింద తమ పై వేయాలని చూస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : టీడీపీ డెల్టా, పల్నాడు టైగర్లు ఎక్కడ..?
కాళేశ్వరం,ఫార్ములా ఈ కార్ రేస్, విద్యుత్ కమిషన్ కేసుల పై కేంద్రం చర్యలు తీసుకోవచ్చు కదా అని బీజేపీ నేతలను ఉద్దేశించి రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనీ లాండరింగ్ కేసుల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ బుల్లెట్ రైలు హబ్గా మారుతుందన్నారు. బుల్లెట్ రైల్ హబ్ కు అవసరరమైన భూమికి సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఇచ్చామన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీకి దగ్గరగా బుల్లెట్ ట్రైన్ హబ్ ఉంటుందని.. 2034 కల్లా బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రావచ్చని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్ – 2, రింగ్ రోడ్, మూసీ నది ప్రక్షాళనకు ఏమీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

