తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో సంచలన విషయం బయటపడింది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ గుర్తించింది. తాజాగా వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నఅప్పన్న రిమాండ్ రిపోర్టులో కుట్రకోణాలను సిట్ ప్రస్తావించింది. కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను 24వ నిందితుడిగా చేర్చిన సిట్.. 2022లో టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను అప్పన్న సంప్రదించినట్లు పేర్కొంది.
Also Read : బస్సు బూడిదలో బంగారం కోసం వేట.. కర్నూలులో నివ్వెరపరిచే దృశ్యాలు
నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్ చేశాడని తెలిపింది. ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు గుర్తించారు. కమీషన్ ఇవ్వడానికి నిరాకరించిన భోలేబాబా డెయిరీ యాజమాన్యంపై కక్ష సాధింపు చర్యలకు దిగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బోలేబాబా డెయిరీపై అనర్హత వేటు వేసేలా చిన్న అప్పన్న కుట్ర చేశాడని, భోలేబాబా డెయిరీని తనిఖీ చేయాలంటూ టీటీడీ అధికారులపై ఒత్తిడి వచ్చినట్లు తెలిపారు. భోలేబాబా డెయిరీపై అనర్హతవేటు వేసేలా అజ్ఞాతవ్యక్తులతో పిటిషన్లు వేయించినట్లు గుర్తించారు. చిన్నఅప్పన్న కుట్రతో బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణ నిలిపివేసినట్లు వెళ్లడైంది.
Also Read : ఎటు పోతోంది ఈ సమాజం.. ఇంత దారుణమా..!
భోలేబాబా డెయిరీ స్థానంలో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సంస్థ అడుగు పెట్టింది. భోలేబాబా కంటే ప్రీమియర్ సంస్థ కిలోకు రూ.138 ఎక్కువ కోట్ చేసినట్లు వెల్లడించారు. పోటీ లేకపోవడంతో కాంట్రాక్టును దక్కించుకున్నట్లు గుర్తించారు. దీనితో చిన్నఅప్పన్నకు రూ.50 లక్షల వరకు ముడుపులు ముట్టినట్లు సిట్ గుర్తించింది. అప్పన్న బ్యాంకు లావాదేవీలు పరిశీలించి అక్రమాలు నిగ్గు తేల్చింది. లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కుట్ర ఛేదన కోసం అప్పన్న కస్టడీను సిట్ కోరనుంది. అప్పన్న విచారణతో మరికొందరిని నిందితులుగా చేర్చిన అధికారులు, త్వరలోనే మరి కొంతమందిని విచారించే అవకాశం ఉంది.

