ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన రావణ్ అరెస్టు ఉదంతం తర్వాత ప్రశ్న ఛానల్ సీఈఓ గమన పాత్ర ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మావోయిస్టులకు మద్దతుగా రూపొందించిన వివాదాస్పద వీడియో ఆధారంగా గన్నవరం పోలీస్స్టేషన్ లో కేసు నమోదు కావడంతో, ఈ కేసు తన మెడకు చుట్టుకోకుండా ఉండేందుకు ఆమె ముందస్తు చర్యలు చేపట్టింది. గతంలో తాము యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వివాదాస్పద కంటెంట్ ఉన్న పలు వీడియోలను డిలీట్ చేసింది. సదరు మూడు యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించిన అడ్మిన్ రైట్స్ పూర్తిగా ఆమె వద్దే ఉండటంతో, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఈ పనిని సులువుగా కానిచ్చేసింది.
Also Read : ఏజెన్సీపై స్పెషల్ ఫోకస్..!
అయితే, పోలీసులు ఇప్పటికే ఆ వీడియోలను వివాదాస్పదమైనవిగా గుర్తించారు మరియు వాటి డేటాను సేకరించేందుకు యూట్యూబ్ యాజమాన్యానికి అధికారికంగా మెయిల్ పంపించేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ తో పాటు పలు ఇతర ప్రాంతాల్లో గమన ఈ మూడు యూట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తూ వచ్చేది. ఈ ఛానళ్లకు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రధానంగా వీడియోలను రూపొందించి ఇచ్చేవాడు. కేసు దర్యాప్తులో భాగంగా కృష్ణా జిల్లా పోలీసులు ఈ కార్యాలయాలపై దాడులు నిర్వహించి పలు ల్యాప్టాప్ లు, హార్డ్ డిస్క్లు, మరియు పెన్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : టెర్రరిజంలో ఏఐ వాడకం.. ఉగ్రవాదులకు స్పెషల్ ట్రైనింగ్..!
ప్రస్తుతం ఈ డిజిటల్ పరికరాలను నిఘా వర్గాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాయి. గమన టెక్నికల్ గా వీడియోలను డిలీట్ చేసినప్పటికీ, స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాల ద్వారా ఆ డేటాను తిరిగి రికవర్ చేసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో వైకాపా నేత ఇంద్రసేన చౌదరి పాత్రపై పోలీసులు నిఘా పెట్టారు. గమనకు ఎలాంటి అద్దె తీసుకోకుండానే ఇంద్రసేన చౌదరి తన సొంత ఫ్లాట్ ను ఇచ్చినట్లు, అంతేకాకుండా ఆమెకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం కూడా అందించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలను వెలికితీసేందుకు గమన, ఇంద్రసేనల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి విశ్లేషిస్తున్నారు.

