ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ముందు నుంచి అనుసరిస్తోన్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవల ఏపీ సర్కార్ శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి.. దాన్ని కేంద్రానికి పంపడంతో నేడు పార్లమెంట్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపధ్యంలో.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో గత ఐదేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కఠిన వైఖరికి భిన్నంగా ఆయన వ్యాఖ్యలు చేసారు.
Also Read : నవ్యాంధ్ర చరిత్రలో కీలక అడుగు.. నేడు పార్లమెంట్ లో కీలక పరిణామం..!
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, అమరావతి రైతులకు న్యాయం జరగాలని మిథున్ రెడ్డి పేర్కొనడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల నినాదంతో అమరావతిని పక్కన పెట్టిన వైసీపీ, ఇప్పుడు అదే అమరావతికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాల గురించి మాట్లాడటం విశేషం. అదే విధంగా.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చలో పాల్గొంటామని ప్రకటించారు. గతంలో అమరావతి అభివృద్ధిపై అనేక విమర్శలు చేసిన ఆ పార్టీ నేతలు, ఇప్పుడు పార్లమెంటులో బిల్లుపై జరిగే చర్చలో పాల్గొంటామని చెప్పడంతో.. వైసీపీ వ్యూహాన్ని మార్చుకుందనే మాట వినపడుతోంది.
Also Read : దుమారం రేపుతున్న కాగ్ నివేదిక..!
రైతులకు ప్రయోజనాలు చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం ద్వారా.. రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాతి పరిణామాలుగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమరావతికి అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం ప్రవేశపెట్టే సవరణ బిల్లుకు మద్దతు తెలపడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తాము అడ్డుకాదనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.

