పశ్చిమాసియాలో రోజు రోజుకి తీవ్రమవుతోన్న యుద్ధం.. అంతర్జాతీయ మార్కెట్ ను అతలాకుతలం చేస్తోంది. యుద్ధ ప్రభావంతో ముడిచమురు సరఫరాకు ఆటంకం కలగడంతో విమాన ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఆకస్మిక ధరల పెంపుతో విమానయాన సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. గతంలో కిలో లీటర్ విమాన ఇంధనం ధర సుమారు రూ. 96,638 గా ఉండగా, నేడు అది ఏకంగా రూ. 2.07 లక్షలకు చేరింది.
Also Read : మూడో కృష్ణుడు ఎన్నాళ్లుంటారు..?
అంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ మొత్తానికి ధరలు పెరగడం గమనార్హం. సాధారణంగా విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో 40 శాతం కేవలం ఇంధనానికే ఖర్చవుతుంది. ఇప్పుడు ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగడంతో విమాన సంస్థలపై పెను ఆర్థిక భారం పడింది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి విమానయాన సంస్థలు తమ టికెట్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం, దేశీయ విమాన ప్రయాణాలపై టికెట్ ధరలు 25 శాతం నుండి 35 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
ఇక అంతర్జాతీయ ప్రయాణాల విషయానికొస్తే, ఈ పెరుగుదల 50 శాతం వరకు కూడా ఉండవచ్చు. అంటే గతంలో రూ. 5,000 ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ. 7,500 నుండి రూ. 8,000 వరకు చేరే ప్రమాదం ఉంది. టికెట్ ధరలతో పాటు ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరిట ప్రయాణికులపై అదనపు భారం వేసేందుకు విమాన సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి. యుద్ధం కారణంగా విమానాలు ప్రయాణించే మార్గాల్లోమార్పులు చేయడం వల్ల ప్రయాణ సమయం పెరగడం, తద్వారా ఇంధనం మరింత ఎక్కువగా ఖర్చు అవ్వడం కూడా ఈ ధరల పెరుగుదలకు మరో కారణం.
Also Read : ట్రంప్ నోటి దూల.. వాళ్ళు బానిసల బిడ్డలు అంటూ వివాదాస్పద కామెంట్..!
వేసవి సెలవుల సమయంలో పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలనుకునే సామాన్యులకు ఇది మింగుడుపడని వార్త. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, కొత్తగా టికెట్లు కొనుగోలు చేసే వారికి జేబు ఖాళీ అవ్వడం ఖాయం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరపడితే తప్ప విమాన ప్రయాణికులకు ఉపశమనం లభించేలా లేదు. ఇటు ప్రజాప్రతినిధులకు చేసే టికెట్ ల ధర కూడా పెరగడంతో ప్రభుత్వాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

