కృష్ణా జిల్లా విజయా డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారం అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర పొలిటికల్ హీట్ పెంచుతోంది. చైర్మన్ ఎన్నిక విషయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, అప్పటివరకు తొందరపడవద్దని టీడీపీ అధిష్టానం ఇచ్చిన సూచనలను సీనియర్ నేత చలసాని ఆంజనేయులు పూర్తిగా బేఖాతరు చేశారు. పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి ఆయన ఏకపక్షంగా చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేయడంపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నామినేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని అధినాయకత్వం ఆదేశించినప్పటికీ చలసాని ఆంజనేయులు మాత్రం వెనక్కి తగ్గకుండా ధిక్కార స్వరాన్ని వినిపించారు.
Also Read : వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు..!
ఈ పరిణామాల నేపథ్యంలో చలసాని ఆంజనేయులుకు టీడీపీ అధిష్టానం గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. “మీకు పార్టీ కావాలో.. లేక పదవి కావాలో తేల్చుకోవాలి” అంటూ అధిష్టానం ఆయనకు అల్టిమేటం జారీ చేసింది. దీనిపై స్పందించిన చలసాని, తనకు కొంత సమయం ఇస్తే ఆలోచించుకుని నామినేషన్ ఉపసంహరణపై నిర్ణయం చెబుతానని కోరారు. అయితే ఆయనకు ఎలాంటి అదనపు సమయం ఇవ్వడం కుదరదంటూ అధిష్టానం స్పష్టం చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ హైడ్రామా నడుస్తున్న తరుణంలోనే, చలసాని ఆంజనేయులు తాను తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరినట్లు ప్రకటించడం గమనార్హం.
Also Read : స్కూల్స్ వద్ద నో జంక్ ఫుడ్.. గవర్నమెంట్ ఆర్డర్..!
ఈ ధిక్కార వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ కావడంతో రంగంలోకి దిగిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చలసాని నిర్ణయంతో పార్టీకి డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు ఈ రోజు విజయా డెయిరీ డైరెక్టర్లతో మంత్రులు అత్యవసరంగా సమావేశం కానున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ లైన్ దాటి నామినేషన్ వేసిన చలసాని ఆంజనేయులుపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయా, లేదా డెయిరీ డైరెక్టర్లను మంత్రులు తమ వైపు తిప్పుకుంటారా అనేది ఇప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

