గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి స్థానిక పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీస్ శాఖలోని కొందరు అధికారులు ఇప్పటికీ ఇంకా వైసీపీ వాసన వీడలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొందరు అధికారుల నిర్లక్ష్యపు పనితీరు కారణంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆమె బహిరంగంగానే ఆరోపించారు. పోలీస్ స్టేషన్లలో సామాన్యులకు న్యాయం జరగడం లేదని, ఎలాంటి రికమండేషన్ లేకపోతే కనీసం ఫిర్యాదులను కూడా స్వీకరించడం లేదని ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : భారత పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు..!
ఈ నేపథ్యంలోనే బాధితులకు న్యాయం చేసేందుకు తానే స్వయంగా, నేరుగా ఒక బాధితురాలితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వచ్చిందని ఆమె మీడియా వేదికగా వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసుల పనితీరుపై ఇప్పటికే పలుమార్లు తీవ్ర హెచ్చరికలు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారుల ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటే, క్షేత్రస్థాయిలో ఉన్న కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని హెచ్చరించారు.
Also Read : ఏపీ లిక్కర్ కుంభకోణం.. జగన్ కథ ముగిసినట్లేనా..?
ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పోలీసులపై ఇలాంటి ఆరోపణలు పదేపదే వస్తున్నాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇకనైనా పోలీసుల పనితీరులో మార్పు రాకపోతే.. ఈ మొత్తం వ్యవహారాన్ని, సదరు అధికారుల వివరాలను నేరుగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని గల్లా మాధవి వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేనే స్వయంగా పోలీసులపై ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు గుంటూరు జిల్లావ్యాప్తంగా సామాన్య ప్రజలలో సైతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

