ఏపి రాజధాని అమరావతిలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎన్నడూ లేనిది ఈమధ్య కాలంలో జరుగుతున్న ఘటనల పై ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం పై సిఎం చంద్రబాబు కూడా మంత్రి నారాయణ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అమరావతి ప్రాంతంలోని నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదాల దృష్ట్యా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మాణ ప్రాంగణాల్లో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాల అమలుపై ఈ సందర్భంగా ఎస్పీ.. కంపెనీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా అమరావతిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు.
Also Read : నాయుడుపై వేటు.. కొత్తగా సీనియర్ నేత..!
నిర్మాణ ప్రాంతాల్లో, కీలక కూడళ్లలో సిసిటీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని కంపెనీలకు స్పష్టం చేశారు. భద్రతా పరమైన లోపాలు లేకుండా చూసుకోవడం ద్వారా అవాంఛనీయ ఘటనలను అరికట్టవచ్చని ఎస్పీ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో దాదాపు రూ. 9 కోట్ల విలువైన పైపులు కాలిపోయాయి. మొత్తం మీద రాజధాని ప్రాంతంలో జరిగిన వివిధ అగ్నిప్రమాదాల వల్ల సుమారు రూ. 21.5 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసారు అధికారులు.
Also Read : ఒక్క కార్టూన్కే భయపడితే ఎలా..?
మెటీరియల్ నిల్వ చేసే యార్డుల వద్ద ప్రతి అంగుళం కవర్ అయ్యేలా హై-డెఫినిషన్ సిసిటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎస్పీ స్పష్టం చేసారు. రాత్రి సమయాల్లో సున్నితమైన ప్రాంతాలను పర్యవేక్షించేందుకు నైట్ విజన్ డ్రోన్లను ఉపయోగించాలని ఎస్పీ ఆదేశించడంతో.. నిర్మాణ సంస్థలు అలెర్ట్ అయ్యాయి. మరోవైపు, రాజధాని ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అమరావతిలోకి ప్రవేశించే ప్రధాన మార్గాల్లో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. లోపలికి వచ్చే ప్రతి వ్యక్తి నుంచి ఆధార్ కార్డు వివరాలు, వాహన నంబర్లతో పాటు వారు వచ్చిన పనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులు సేకరించి రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు.

