సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ సెలవుపై వెళ్లారు. నిజానికి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెచ్చిన కమ్మ కులానికి చెందిన ఐఏఎస్ అధికారి.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు మాత్రం ఎందుకు నచ్చటం లేదు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో, సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కాటమనేని భాస్కర్ తీరుపై కొందరు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు నేరుగా అప్పటి సీఎం జగన్కు ఫిర్యాదు చేశారు. అయితే జగన్ మాత్రం.. భాస్కర్పై చర్యలు తీసుకునేందుకు మొగ్గు చూపించలేదు. పైగా ఆయనతో మీకేం సంబంధం.. ఏదైనా ఉంటే.. నన్ను అడగండి.. అంటూ సొంత పార్టీ నేతలతో చెప్పిన జగన్.. కాటమనేని భాస్కర్ను వెనకేసుకొచ్చారనేది సచివాలయ వర్గాల్లో వినిపించే మాట.
ఆ ఐఏఎస్ అధికారి జగన్కు ఎంతో నచ్చారనేందుకు ఐదేళ్ల వైసీపీ పాలనలో కాటమనేని భాస్కర్ను కేవలం రెండు సార్లు మాత్రమే బదిలీ చేశారు. ఆ వెంటనే ఆయనకు వెంటనే మంచి పోస్టింగ్ ఇచ్చారు తప్ప.. ఎప్పుడు వెయిటింగ్లో పెట్టలేదు. ఆయనను అధికారికంగా కూడా ఇబ్బందులు పెట్టలేదు. వేధించలేదు.. సాధించలేదు. అలాంటి మంచి లక్షణాలు కలిగిన ఐఏఎస్ అధికారిని ఒక మంత్రి అవినీతికి, అక్రమాలకు సహకరించలేదనే కారణంగా ఆయనపై బదిలీ వేటు వేశారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలని ఇప్పుడు కొందరు ఐఏఎస్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి అవినీతి, అక్రమాలకు ఎవరు అండగా ఉన్నారనే విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది.
కాటమనేని భాస్కర్ పనితీరుపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఆర్డీఏ కమిషనర్గా భాస్కర్ను నియమించారు. అయితే పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఆయన తీరు నచ్చలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను బదిలీ చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వంలో ఆ నిజాయితీ అధికారికి ఇబ్బందులు, వేధింపులు ఎదురయ్యాయనే విషయం బయటపడకపోయినా.. ఆ ఐఏఎస్ అధికారే సెలవు పై వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజాయితీ, సమర్ధత, ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడటం, కష్టపడి పనిచేయటం, ఎవరికి అన్యాయం జరిగిన సరే.. కుల, మతాలకు అతీతంగా న్యాయం చేయాలనేది కాటమనేని భాస్కర్ తపన. నిజానికి కూటమి ప్రభుత్వానికి ఆయన వల్ల మంచి పేరే వస్తుంది. కానీ ఇప్పుడు ఆయన వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటనేది అస్సలు తెలియటం లేదు. అసలు విషయం ఏమిటంటే.. అమరావతి రైతులకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి భాస్కర్ ఎంతో ప్రయత్నం చేశారని.. అయితే ముందు అమరావతి నిర్మాణ పనులు చేపట్టాలని.. తర్వాతే రైతుల సమస్యల గురించి మాట్లాడాలంటూ మంత్రి నారాయణ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి మంత్రి నారాయణతో భాస్కర్ విభేదించడంతో దాదాపు 3 నెలల పాటు భాస్కర్తో ఎలాంటి సమావేశాలను మంత్రి నారాయణ నిర్వహించలేదు. ఆ తర్వాత చంద్రబాబు, లోకేష్పై ఒత్తిడి తెచ్చి భాస్కర్ను బదిలీ చేయించారని అప్పట్లో మీడియాలో వరుస కథనాలు వచ్చాయి కూడా.
మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న భాస్కర్.. ఎన్నో ఐటీ సంస్థలు ఏపీకి రావడానికి తన వంతు కృషి చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రస్తుతం కాటమనేని భాస్కర్కు ఏ ఇబ్బందులు ఎదురయ్యాయో, ఎవరి వలన ఇబ్బందులు వచ్చాయో తెలియదు కానీ.. ఆయన ఇప్పుడు సెలవు పై వెళ్తున్నారనే ప్రచారం ప్రభుత్వంలో జోరుగా జరుగుతుంది. అసలు భాస్కర్ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయనే అంశంపై సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

