వైసీపీ అంటే.. అది ఒక నియంత పాలనలో ఉన్న పార్టీ అనే విషయం అందరికీ తెలుసు. అక్కడ ఎవరైనా సరే.. ఏ స్థాయి నేత అయినా సరే.. చెప్పింది చేయడం తప్ప.. ఎదురు మాట్లాడటం అనేది లేదు. అలా మాట్లాడితే.. బాత్రూంలో గుండె పోటు వస్తుందని వైసీపీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే వైసీపీ రాష్ట్ర స్థాయి మొదలు నియోజకవర్గ స్థాయి సమావేశాల వరకు.. అది ఎలాంటి మీటింగ్ అయినా సరే.. వేదిక పైన కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఉంటారు. మిగిలిన నాయకులంతా వేదిక ముందు కూర్చుని.. అధినేత చెప్పింది విని.. తూ చా తప్పకుండా పాటించాల్సిందే. ఇలా చేస్తే.. అనే మాట అంటే చాలు.. తర్వాత మాట అనటానికి అవకాశం ఉండదు.
Also Read : బ్రేకింగ్; పేర్ని నానికి షాక్ ఇచ్చిన పోలీసులు..!
తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ రూ.2 లక్షల కోట్లు వృధాగా ఖర్చు చేస్తున్నారని.. దానికి బదులుగా మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు ప్రాంతాలను కలిపి మావిగన్ అని పేరు పెట్టి.. దానిని రాజధానిగా అభివృద్ధి చేయాలని విచిత్రమైన సూచన చేశారు. జగన్ చేసిన ఈ ప్రతిపాదనపై.. ఏపీ ప్రజలంతా నవ్వుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీ ప్రజలే కాదు.. దేశ వ్యాప్తంగా ఇదేం విచిత్ర ప్రతిపాదన, ఇదేం పేరు అని సెటైర్లు కూడా వేస్తున్నారు. జగన్ చెప్పిన మావిగన్పై సొంత పార్టీ నేతలు విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పొలిటికల్ అనలిస్టు రూపంలో వైసీపీకి భజన చేసే పాషా అనే నేత కూడా జగన్ను కామెడీ పీస్ చేశారంటూ వ్యాఖ్యానించారు.
తాజాగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా నేతలతో వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాస్తవానికి ఇప్పటి వరకు వైసీపీలో ఒకటే రూల్. సజ్జల చెప్పింది మాత్రమే వినాలి. ఆయనకు ఎదురు చెప్పటం అంటే.. నేరుగా కొరివితో తల గొక్కున్నట్లే.. అనేది అందరికీ తెలుసు. కానీ తొలిసారి సజ్జలకు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సజ్జల టెలీకాన్ఫరెన్స్లో రెండు జిల్లాల పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మావిగన్ రాజధాని విషయంలో పార్టీ లైన్కు కట్టుబడి ప్రచారం చేయాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్యనేతలతో సజ్జల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ మీడియా, మీడియాలో వైసీపీపై జరుగుతున్న దాడికి ఆచరణాత్మక ప్రణాళికతో సమాధానం చెప్పాలన్నారు. మావిగన్ అనే విషయం జగన్ దూరాలోచనతో చెప్పారని.. పార్టీలోని అన్ని స్థాయిల నాయకులు దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఎస్ఆర్కే సూచించారు.
అయితే సజ్జల సూచనలు, ఆదేశాలపై గుంటూరు, కృష్ణా జిల్లా నేతలు కస్సుమన్నారు. ఎవరికీ అర్థం కాని వింత ప్రకటన ఇచ్చి.. పార్టీని, క్యాడర్ ను డిఫెన్స్లో నెట్టారని గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. అసలు ఎవరిని సంప్రదించి మావిగన్ అనే పేరుతో ప్రకటన చేశారని కృష్ణా జిల్లా మాజీ మంత్రి ప్రశ్నించారు. రాజధాని పనులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన సమయంలో అధినేత ప్రకటన కొత్త తలనొప్పులు తెచ్చిందన్నారు. పార్టీలో ఎటువంటి చర్చ లేకుండా, కనీసం రెండు జిల్లాల నేతలతో చర్చించకుండా ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియడం లేదని గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read : అమరావతి కోసం మహిళా ఎంపీలు.. రాష్ట్రానికి సంబంధం లేకపోయినా..!
జగన్ చేసిన మావిగన్ అనే అంశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు క్యాడర్, లీడర్ సిద్దంగా లేరని రెండు జిల్లాల నేతలు ఓపెన్గా, మూకుమ్మడిగా తెగేసి చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న సకల శాఖా మంత్రిగా వ్యవహరించిన సజ్జల.. “నాకు చెప్పి ఏంలాభం.. అధినేత దగ్గరే చెప్పండి..” అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా వైసీపీ నేతలు ఘాటుగానే స్పందించారు. పార్టీ అధ్యక్షుడితో మీటింగ్ పెట్టిస్తే చెపుతామన్నారు. మంచి చెడులు చర్చిస్తామన్నారు కూడా. మీకు ఇంకా గ్రౌండ్ రియాలిటీ తెలియడం లేదు అన్న ఒక ఎమ్మెల్సీ మాటకు నొచ్చుకున్న సజ్జల.. “పార్టీ అధ్యక్షులు చెప్పింది చేయడమే నా పని.. ఆ పై మీ ఇష్టం” అంటూ టెలికాన్ఫరెన్స్ ముగించారు.

