మార్చి 2026 నాటికి మావోయిస్ట్ రహిత దేశంగా మారుస్తామంటూ రెండేళ్ల క్రితం కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగా ఆపరేషన్ కగార్ ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో కలిసి దండకారణ్యాన్ని జల్లెడ పట్టారు. అటవీ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తూ.. గిరిజనులకు ఆధునిక జీవన విధానం అలవాటు చేస్తున్నారు. ఇదే సమయంలో మావోయిస్టుల ఏరివేతతకు కఠిన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు అదనపు బలగాలు కేటాయించారు. ఎన్కౌంటర్లతో దండకారుణ్యం దద్దరిల్లిపోయింది. పోలీసులతో పోరాడలేక వందల సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ముఖ్య నేతలు కూడా వయోభారం, ఆరోగ్య సమస్యలతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట రికార్డుస్థాయిలో లొంగుబాట్లు చోటు చేసుకుంటున్నాయి కూడా.
Also Read : దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. కారణం ఏంటీ..?
ఇదే సమయంలో అందరి దృష్టి మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు పై పడింది. మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి. 2018 నవంబర్లో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన వయసు 76 ఏళ్లు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సారంగాపూర్కు చెందిన లక్ష్మణరావు.. బీఈడీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఉపాధ్యాయునిగా కూడా పని చేశారు. వరంగల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి తన ఉద్యోగాన్ని వదులుకున్నారు. వరంగల్లో కొండపల్లి సీతారామయ్య, నల్ల ఆదిరెడ్డితో ఏర్పడిన పరిచయం.. ఆయనను మావోయిస్టు ఉద్యమం వైపు నడిపింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంతో సహా భారతదేశంలోని రెడ్ బెల్ట్లో ఆయన చురుకుగా వ్యవహరించారు.
మావోయిస్టు ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్న తర్వాత.. గణపతి నేపాల్ మీదుగా ఫిలిప్పీన్స్ వెళ్లిపోయారని అంతా అనుమానిస్తున్నారు. సుమారు 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిన గణపతి.. ఆపరేషన్ కగార్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కీలక నేతల లొంగుబాటుతో పాటు మావోయిస్టు ఉద్యమం పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో.. గణపతి కూడా లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేపాల్ మీదుగా ఢిల్లీ చేరుకున్నారని.. త్వరలోనే కేంద్ర మంత్రి అమిత్ షా ఎదురుగా లొంగిపోతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గణపతి లొంగుబాటులో మావోయిస్టు అగ్రనేతల శకం దాదాపు ముగిసినట్లే.
Also Read : అమెరికాను వణికిస్తున్న ఇరాన్ చౌక డ్రోన్లు..!
గణపతి లొంగుబాటు పుకార్లు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్షాతో సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్, ఇంటలిజెన్స్ డీజీ విజయ్, ఎస్ఐబీ ఐజీ సుమతి సుమారు గంటన్నరపాటు చర్చించారు. మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం రేవంత్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆపరేషన్ కగార్కు తెలంగాణ పోలీసులు సహకరించారని, ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఇలాగే సహకరించాలని అమిత్ షా సూచించారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేలా చూడాలని..
తెలంగాణలో ఈగల్ టీమ్ను బలోపేతం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు గురించి అమిత్షాకు సీఎం రేవంత్ రెడ్డి విచారించారు. తెలంగాణకి ఐపీఎస్ కేడర్ను పెంచాలని కూడా రేవంత్ కోరారు. ఈ అంశాలపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

