చేతిలో ఓ సెల్ఫోన్, చిన్న మైక్ ఉంటే చాలు.. నోటికి ఏమనిపిస్తే అది చెప్పడమే. భారతదేశం అంటే మతసామరస్యానికి ప్రతీక. అలాంటి దేశంలో ప్రస్తుతం కొందరు పనిగట్టుకుని మరి మతి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకటో రెండో ఘటనలను సాకుగా తీసుకుని.. ప్రతి ఒక్కరినీ అదే కోణంలో చూస్తున్నారు. అందరూ అలాంటి వాళ్లే అన్నట్లుగా తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. అలాంటిదే ఇటీవల జరిగిన ఓ ఘటన.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.
తెలంగాణలోని మేడారం జాతర సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ఒక వీధి వ్యాపారిని యూ ట్యూబర్ల బృందం ముందు “ఫుడ్ జిహాద్” చేయడం లేదని నిరూపించుకోవడానికి తన సొంత ఆహారాన్ని తానే తినమని బలవంతం చేశారు. యూ ట్యూబర్లు బహిరంగంగా వేధించిన తర్వాత, అతను తన పట్టణంలోని నివాసితుల నుండి మాత్రమే కాకుండా, “వ్యూస్, లైక్స్” కోసం వీడియోలు చేసినందుకు యూ ట్యూబ్ జర్నలిస్టులను విమర్శించిన ప్రభావశీలులు, రాజకీయ పార్టీల నుండి కూడా మద్దతు లభిస్తోంది.
Also Read : పవన్ ను ఎందుకు వాడుకోలేదు..? బీజేపీ కేడర్ ఫైర్..!
యూ ట్యూబర్ల దాడికి గురైన కోవా బన్ విక్రేత వలీ వ్యవహారం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. దీంతో కోవా బన్ వలీకి ఏపీ మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. “ప్రియమైన సోదరుడు వలి, మీరు దీన్ని భరించాల్సి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎల్లప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం కోసం నిలబడే మన తెలుగు సమాజంలో ఇటువంటి విభజన, మతపరమైన ప్రవర్తనకు స్థానం లేదు. నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను. మీ ప్రసిద్ధ కోవా బన్ను రుచి చూడటానికి ఎదురు చూస్తున్నాను!”. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా వలీకి అండగా నిలిచారు. చిరువ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది.. అంటూ వ్యాఖ్యానించారు. “పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవాబన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడుని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదు. ఈ సంఘటన తర్వాత చాలామంది చిరువ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన కారణంగా శివరాత్రికి తాను వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆ వ్యక్తి బాధను వ్యక్తం చేయగా వ్యక్తిగతంగా రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించాం. చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. వలి లాంటి చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మంత్రి నారా లోకేష్, మంత్రి అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ చిరువ్యాపారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేయడం కూడా ఆనందంగా ఉంది. ఈ సంఘటనను మతం కోణంలో చూడొద్దని కోరుతున్నా.” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Also Read : గేట్స్ రాకతో ఏపీకి గ్లోబల్ అటెన్షన్
తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలకు చోటు లేదని ఏపీ ఉర్దూ అకాడమీ ప్రకటన జారీ చేసింది. మేడారం కోవా బన్ ఉదంతంలో యావత్ హిందూ సమాజం వలీకి అండగా నిలవడం హర్షణీయం. మత సామరస్యం వెల్లివిరిసేలా కూటమి పాలన సాగుతోందని ప్రకటన జారీ చేశారు. కోవా బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారమందించాలని కోరారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కోవ బన్ను పరిశ్రమకు వలీ, అతని మిత్ర బృందానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. సమాజంలో శాంతి, ఐక్యత నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

