కొంతమందికి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. అలాంటి వారిలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు రాజకీయాల్లోనే సంచలనంగా మారిన జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన అధికారిగా లక్ష్మీనారాయణకు ప్రత్యేక గుర్తింపు. ఇక జగన్ అరెస్టు, 16 నెలల జైలు జీవితం గడపటానికి ప్రధాన కారణం కూడా ఆయనే. 2012లో అక్రమాస్తుల కేసులో జగన్ను లక్ష్మీనారాయణ అరెస్టు చేశారు. ఆ కేసులో జగన్ ఇప్పటికీ కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. అందుకే లక్ష్మీనారాయణకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
శ్రీశైలం సమీపంలోని సుండిపెంట ఊరులో విద్యాభ్యాసం చేశారు లక్ష్మీనారాయణ. ఈయన కర్నూలు జిల్లాకు చెందిన మహారాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ అధికారి. డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్లి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డీఐజీగా 2006 జూన్లో సొంత రాష్ట్రమైన హైదరాబాద్లో విధుల్లో చేరాడు. సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాద్ విభాగంలో జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. సిబీఐ నుండి స్వచ్ఛంద విరమణ తీసుకున్న తరువాత, రాజకీయాల్లోకి ప్రవేశించారు.
Also Read : గేట్స్ రాకతో ఏపీకి గ్లోబల్ అటెన్షన్
ఉద్యోగానికి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2018 నవంబరులో లోక్సత్తా పార్టీలో చేరమని ఆ పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఆహ్వానించగా పరిశీలిస్తానని లక్ష్మీనారాయణ చెప్పారు. లోక్సత్తాలో చేరే ఆలోచన వద్దనుకుని, సొంతంగా ఒక కొత్త పార్టీ పెట్టనున్నారని ఆ తరువాత పత్రికల్లో ఊహాగానాలు వచ్చాయి. పార్టీ పేరు జనధ్వని అని కూడా అప్పట్లో పుకార్లు షికారు చేశాయి కూడా. చివరికి 2019 మార్చి 17న అతడు జనసేన పార్టీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం నుండి జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జనసేన పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల్లో కొంతకాలం పాటు సైలెంట్గా ఉండిపోయారు. 2023 డిసెంబరులో జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయనకు కేవలం 5,160 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Also Read :భారత్కు శివరాత్రి.. పాకిస్తాన్కు కాళరాత్రి..!
ఎన్నికల తర్వాత సైలెంట్గా ఉన్న లక్ష్మీనారాయణ.. ఇప్పుడు తిరిగి ఉద్యోగంలో చేరారు. చాలామంది అధికారుల మాదిరే ఉద్యోగం చేసేటప్పుడు వచ్చిన మంచి పేరుతో రాజకీయాల్లో రాణిస్తామనుకుంటారు. కానీ సక్సెస్ అయిన వారు చాలా అరుదు. లక్ష్మీనారాయణ కూడా అంతే. సీబీఐ డైరెక్టర్గా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి, జగన్ అక్రమాస్తుల కేసులు విచారించినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా పేరు వచ్చింది. అందుకే రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. నెల రోజుల క్రితమే ఆయన భార్య సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.3 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. తాజాగా ఆయన మేఘా ఇండస్ట్రీస్ గ్రూప్లోని ఎలక్ట్రికల్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ అనుబంధ సంస్థ ఈవీ టెక్లో వైస్ ప్రెసిడెంట్గా చేరారు. ఇకపై ఆ కంపెనీ బాధ్యతలన్నీ ఆయన నిర్వహిస్తారని తెలుస్తోంది.

