ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలకు వేదిక సిద్ధమవుతోంది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆత్మపరిశీలనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రీజనల్ కోఆర్డినేటర్లు. జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లతో జరగనున్న ఈ సమావేశం పార్టీకి కొత్త దిశానిర్దేశం చేయనుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read : కావలి ఎమ్మెల్యేలో మార్పు రాదా..? చర్యలకు రంగం సిద్దం..?
పార్టీ అధికారంలో లేని సమయంలో కేడర్లో నిస్పృహ పెరగకుండా క్షేత్రస్థాయిలో కొత్త ఉత్సాహం నింపేందుకు జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల పునర్నిర్మాణం చేపట్టి.. చురుకైన యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం పెంచి, పార్టీని మరింత క్రమబద్ధంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందని సీనియర్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా విభాగాన్ని మరింత శక్తివంతం చేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రత్యేక వ్యూహం రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికలను “సెమీఫైనల్స్”గా భావిస్తున్న జగన్, ప్రతి గ్రామంలోనూ పార్టీ కేడర్ పోరాట స్ఫూర్తితో పనిచేయాలని నేతలకు పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల పరిస్థితులను అధిగమించి. కూటమి ప్రభుత్వంపై ప్రజా అసంతృప్తి పెరుగుతోందని చెబుతున్న జగన్.. దానిని రాజకీయంగా అనుకూలంగా మలచుకోవాలనేది పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. “ఓటమి తాత్కాలికం.. పోరాటమే శాశ్వతం” అనే భావనతో కేడర్లో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపేందుకు జగన్ ప్రయత్నించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : తెలుగు తమ్ముళ్లకు పవన్ మాస్ వార్నింగ్..!
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, సంక్షేమ పథకాలు, పెరిగిన నిత్యావసర ధరలు.. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీల అమలులో జాప్యాన్ని ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. అసెంబ్లీ లోపల, వెలుపల ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం ద్వారానే పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధించగలదని పార్టీ నేతలకు జగన్ స్పష్టం చేసే అవకాశముంది. ప్రజల్లో నిరంతరం కనిపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా నియోజకవర్గ కో ఆర్డినేటర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
ఒకవైపు అధికార కూటమి దూకుడు, మరోవైపు పార్టీ మార్పుల ప్రచారం మధ్య వైసీపీకి ఈ సమావేశం కీలక మలుపుగా మారింది. పార్టీ అంతర్గత ఐక్యతను బలపరచడంతో పాటు, కేడర్కు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడమే జగన్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వగలిగితే.. వైసీపీ మళ్లీ రాజకీయంగా పుంజుకునే అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

