ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పని తీరును ప్రోత్సహించేందుకు గానూ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.. ర్యాంకులను ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై కీలక సమీక్ష నిర్వహించి, ర్యాంకులు ప్రకటించారు. పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా, వివిధ శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ ఎంత వేగంగా జరుగుతోందనే అంశంపై మంత్రులకు రేటింగ్స్ ఇచ్చారు. టైం తో సహా మంత్రులకు రేటింగ్ ఇచ్చారు సిఎం.
Also Read : లోకేష్ సీఎం.. ముహూర్తం ఫిక్స్..!
ముఖ్యమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా మంత్రులు నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ నిలిచారు. ఇక ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరికంటే చివరలో ఉండటం చర్చనీయాంశం అయింది. సీనియర్ మంత్రులు కూడా ఒకరిద్దరు వెనుకబడ్డారు.
Also Read : మళ్లీ స్పెషల్ ఆఫీసర్ల పెత్తనం.. ఇలా అయితే..!
మంత్రులు ఫైళ్లను పెండింగ్లో పెట్టకుండా, నిర్ణీత సమయంలోగా క్లియర్ చేయాలని చంద్రబాబు స్పష్టం చేసారు. పరిపాలనలో వేగం ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందుతాయని, దీనిపై మంత్రులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు. ఇక కలెక్టర్ల సమావేశం రెండో రోజు కూడా పలు కీలక అంశాలపై జరగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై అధికారుల ప్రత్యేక ప్రజంటేషన్, రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలపై సంబంధిత శాఖలతో సీఎం సమీక్ష నిర్వహించారు.

